టిడిపి ఎమ్మెల్యేలకు కెసిఆర్ గాలం: టి సచివాలయంలో మీడియాపై ఆంక్షలు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఆపరేషన్ ఆకర్ష్ను ఉధృతం చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. టిడిపి ఎమ్మెల్యేలకు నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాదులోని టిడిపి ఎమ్మెల్యేలకు ఆయన నేరుగా ఫోన్లు చేస్తున్నారు. ఒకసారి తనను కలవాలని పదేపదే కేసీఆర్ ఫోన్ చేస్తున్నారని, టీఆర్ఎస్లో చేరాలని ఒత్తిడి తెస్తున్నారని సహచర నేతల దగ్గర గ్రేటర్ ఎమ్మెల్యేలు అంటున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఎమ్మెల్సీ, గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ రంగంలోకి దిగారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు భావిస్తున్నారు. కెసిఆర్ తనకు ఫోన్చేసినట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు. కాగా, తెలంగాణ రాష్ట్ర మంత్రులతో సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు.

తెలంగాణ సచివాలయంలో మీడియాపై సోమవారం మీడియాపై ఆంక్షలు ప్రారంభమయ్యాయి. సి-బ్లాక్లోకి మీడియాకు అనుమతి ఇవ్వొద్దంటూ సెక్యూరిటీని ఐఅండ్పీఆర్ కమిషనర్ ఆదేశించారు. సీఎం పీఆర్వో గదిలో కూర్చున్న మీడియా ప్రతినిధులు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి నేడోరేపో తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సి-బ్లాక్లో మీడియా ప్రతినిధులను పంపించివేయడంపై అన్ని బ్లాకుల్లో ఉన్న మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకుని నిరసన కార్యక్రమానికి సిద్ధమవుతుండంతో వెంటనే సీఎం పీఆర్వో అక్కడకు చేరుకుని మీడియా ప్రతినిధులతో మాట్లాడే ప్రయత్నం చేశారు.
సమర్థించిన ప్రెస్ అకాడమీ చైర్మన్
తెలంగాణ సచివాలయంలో మీడియాపై సహేతుకమైన ఆంక్షలు ఉంటాయని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. జర్నలిస్టుల సంక్షేమ నిధికి ప్రతీ ఏటా రూ. 10 కోట్ల చొప్పున రూ. 100 కోట్లు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications