టిపిసిసి చీఫ్ రేసులో కెసిఆర్, సోనియా నో?: డిగ్గీతో భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసిన వెంటనే ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ చీఫ్గా ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావును ప్రకటించే అవకాశముందట. కెసిఆర్ మరో రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండి రాజకీయపరమైన అంశాలు కాంగ్రెసు పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. విలీనమా లేక పొత్తా అనే విషయంలో తెరాస వర్గాలు మల్లగుల్లాలుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విలీనం చేసిన వెంటనే పిసిసి చీఫ్గా కెసిఆర్ను ప్రకటించేందుకు కాంగ్రెసు సిద్ధపడిందట.
కెసిఆర్ తన పార్టీని విలీనం చేయాలంటూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. విలీనం లేదా కాంగ్రెస్తో పొత్తుపై బహిరంగంగా ఏమీ చెప్పనప్పటికీ, విలీనానంతరం కాంగ్రెస్లో తన పరిస్థితిపై కాంగ్రెస్ అధిష్ఠానంతో కెసిఆర్ చర్చలు జరుపుతున్నారట. ఇందులో భాగంగా కెసిఆర్ తన పార్టీ విలీనానంతరం తెలంగాణ కాంగ్రెస్ (టిపిసిసి) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
పార్టీని విలీనం చేస్తే.. అంటూ కెసిఆర్ కాంగ్రెసు ముందు డిమాండ్లు పెడుతున్నట్లుగా మొదటి నుండి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణకు, సీమాంధ్రకు ప్రత్యేక పిసిసిలు ఏర్పాటు చేస్తామని దిగ్విజయ్ సింగ్ తెలంగాణ ప్రాంత నేతలకు హామీ ఇచ్చారు కూడా. కెసిఆర్ పొత్తుకే ఆసక్తి చూపిస్తున్నారట. అయితే విలీనం చేస్తే మాత్రం చీఫ్ బాధ్యతలు కట్టబెట్టే అవకాశాలున్నాయట. సోనియా ముందు కెసిఆర్ కొన్ని డిమాండ్లు పెట్టినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తర్వాత తనను సిఎంను చేయాలని కెసిఆర్ చెప్పారని, దానికి సోనియా ఆమోదం తెలపలేదని ప్రచారం జరుగుతోంది.
కాగా, సోనియా సూచనల మేరకు కెసిఆర్ ఆదివారం రాత్రి దిగ్విజయ్ సింగ్తో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు చర్చలు జరిపారు. కెసిఆర్తోపాటు రాజ్యసభ సభ్యులు కె కేశవ రావు కూడా ఉన్నారు.