ఏపీలో కేసీఆర్ బహిరంగ సభ - బెజవాడ నడిబొడ్డున..!!
ఏపీలో కేసీఆర్ జాతీయ పార్టీకి మద్దతుగా ఆసక్తి కర పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించారు. టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్రీయ సమితిగా మార్చుతూ పార్టీ తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానం ద్వారా జాతీయ పార్టీ హోదా కోరుతూ ఈ రోజు టీఆర్ఎస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. అయితే, జాతీయ హోదా రావాలంటే ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పార్టీ సీట్లు - ఓట్లు సాధించాల్సి ఉంటుంది. అందులో భాగంగా ప్రధానంగా తెలంగాణ సరిహద్దు రాష్ద్రాల పైన కేసీఆర్ ఫోకస్ పెట్టారు.
బెజవాడ సెంటర్ లో కేసీఆర్ హోర్డింగ్ లు
తొలిగా మహారాష్ట్రలో రైతు సమస్యల పైన పోరాటం చేయనున్నారు. మహారాష్ట్రలోని రైతు సంఘాలు కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ను అనుబంధ సంఘంగా ఉండేందుకు ముందుకొచ్చింది. పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రంలో ఏపీలోనూ వ్యూహాత్మకంగా పావులు కదిపేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు. ఏపీలో ప్రస్తతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎవరు కేసీఆర్ తో కలుస్తారనేది ఆసక్తి కర చర్చలకు కారణమవుతోంది. ఇదే సమయంలో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన వేళ ఆంధ్రప్రదేశ్లోనూ ఫ్లెక్సీలు వెలిశాయి. కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. విజయవాడలోని వారధి ప్రాంతంలో హోర్డింగులు ఏర్పాటు చేశారు. కొత్తపార్టీ పోస్టర్లు ఏపీలో విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో కనిపించాయి. హోర్డింగ్పై జయహో కేసీఆర్ అంటూ ఆయన చిత్రంతో పాటు కేటీఆర్ చిత్రాలను ముద్రించారు. వారధి సెంటర్తో పాటు నగరంలోని వేర్వేరుచోట్ల పోస్టర్లు హోర్డింగ్లు ఏర్పాటయ్యాయి. ఏపీలో జయహో కేసీఆర్ హోర్డింగ్ లు కనిపిచటం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది.
ఏపీలో బహిరంగ సభకు ప్రణాళికలు
జాతీయ పార్టీగా గుర్తింపు దక్కాలంటే దక్కించుకోవాల్సిన ఓట్ల పైన కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలు, అదే విధంగా తెలంగాణ - కర్ణాటక సరిహద్దు ప్రాంతాలతో పాటుగా రెండు రాష్ట్రాల్లోని రైతుల అంశాలనే ప్రధాన అజెండాగా ప్రస్తావించేందుకు సిద్దమయ్యారు. ఇటు ఏపీలో నెలకొన్న రాజకీయ వాతావరణంలో కేసీఆర్ ఏ రకంగా అడుగులు వేస్తారనేది ఆసక్తి కరమే. ప్రధానంగా అధికార వైసీపీ వర్సస్ టీడీపీ - జనసేన అన్నట్లుగా రాజకీయం పూర్తగా ఆ మూడు పార్టీల మధ్యనే తిరుగుతోంది. బీజేపీ ప్రస్తుతం జనసేనతో పోటీతో ఉన్నా..ఎన్నికల సమయానికి ఏ పార్టీ ఎవరితో కలుస్తుందనే దాని పైన క్లారిటీ రానుంది. ఇదే సమయంలో సంక్రాంతి సమయానికి ఏపీలో పార్టీ విస్తరణ దిశగా కార్యక్రమాల నిర్వహణకు కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతికి భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఏపీలో బీఆర్ఎస్ (భారత రాష్ట్రీయ సమితి)కు ఆదరణ ఉంటోందని గులాబీ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాల్లో ఉన్న వారు.. ఏపీలో రాజకీయాల్లో కేసీఆర్ కు సహకారం అందించేందుకు సిద్దమవుతున్నారని చెబుతున్నారు.
ఏపీ రాజకీయాల్లో మద్దతు దొరికేనా
ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు నాయకులతో సీఎం కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో జనవరి నెలలో భారీ సభకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం కేసీఆర్ జన్మదిన వేడుకలను పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలివర్రులో ఘనంగా నిర్వహించారు. ఉండి, వెలివర్రుకు చెందిన కేసీఆర్ అభిమానులు భారీ కేక్ను తయారు చేయించి కట్ చేశారు. విశాఖలోని ముఖ్యకూడళ్లలో కేసీఆర్ పుట్టినరోజు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. 'దేశానికి అవసరమైన జన హృదయనేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ మద్దిలపాలెం, సత్యం జంక్షన్, గురుద్వార, స్పెన్సర్స్, సిరిపురం జంక్షన్లలో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. దీంతో..ఇక్కడ ఉన్న మద్దతును తన పార్టీకి అనుకూలంగా మలచుకొనేందుకు సీఎం కేసీఆర్ ఏపీలోనూ రాజకీయంగా అడుగులు వేసేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది. కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో ఎంట్రీతో..ఆంధ్ర రాజకీయాలపైన ఎటువంటి ప్రభావం చూపుతుందనేది వేచి చూడాలి.