చావాలని కోరుకున్నారు, బాధ ఉంది, ఆరంభమే: కేసీఆర్
హైదరాబాద్: ఎవరైనా తాము బతకాలని కోరుకుంటారని, ఆచార్య జయశంకర్ మాత్రం చనిపోవాలని కోరుకున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం చెప్పారు. ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తాము ఆచార్య జయశంకర్ పేరు పెట్టామన్నారు. తెలంగాణకు జయశంకర్ కంటే గొప్పవాడు లేడన్నారు. అలాంటి వ్యక్తి పేరు తాము పెట్టుకుంటే ఆంధ్రా వారికి కష్టమెందుకని ప్రశ్నించారు. మా తెలంగాణలో, మావాళ్ల పేరు మేం పెట్టుకుంటామని చెప్పారు. ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు.
1952లో తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో కలుపుదామన్నప్పుడు జయశంకర్ సారు విద్యార్థి నాయకుడు అని చెప్పారు. తెలంగాణను కలపడాన్ని వ్యతిరేకిస్తూ.. ఇడ్లీ సాంబారు గో బ్యాక్ ఉద్యమం వచ్చిందన్నారు. నాడు ఓ సమావేశానికి జయశంకర్ వరంగల్ నుండి వచ్చేటప్పుడు మధ్యలో ఆయన వాహనం ఆగిపోయిందన్నారు.
అదే సమయంలో సమావేశ ప్రాంగణంలో కాల్పులు జరిగి ఆరుగురు విద్యార్థులు చనిపోయారని, దాని పైన జయశంకర్ స్పందిస్తూ.. వాహనం చెడిపోకుండా ఉండి, తాను కూడా వచ్చి ఉంటే ఏడో వ్యక్తిని చనిపోయేవాడినని, తెలంగాణలో కష్టాలు చూసే కంటే చనిపోతే బాగుండునని అన్నారని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ దుఖం చూసి జయశంకర్ కన్నీరుమున్నీరయ్యారన్నారు.
తెలంగాణ వచ్చిన ఈ సమయంలో జయశంకర్ సారు లేకపోవడం చూస్తే తనకు బాధగా ఉందని, ఏడుపు వస్తోందన్నారు. జయశంకర్ మడమతిప్పని పోరాట యోధుడు అన్నారు. తెలంగాణ ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు పోరాటం చేశాడన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని దెబ్బలు తిన్నా ఆయన తగ్గలేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అనుక్షణం సజీవంగా ఉంచారన్నారు.