మనం మనం: బాబుతో కేసీఆర్, భయపడను, కేంద్రంపై...
హైదరాబాద్: ఇరు రాష్ట్రాల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే మనం మనం మాట్లాడుకుందామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తాను చెప్పానని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం చెప్పారు. రాజ్ భవన్లో చంద్రబాబుతో భేటీ అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఉద్యోగుల అంశంపై ప్రధానంగా...
ఉద్యోగుల అంశాలపై ప్రధానంగా చర్చించామని చెప్పారు. ఏమైనా ఉంటే చర్చించుకొని పరిష్కరించుకుందామని చంద్రబాబుకు చెప్పానని తెలిపారు. కూర్చొని మాట్లాడేందుకు తాను ఎప్పుడు సిద్ధమేనని గతంలోను చెప్పానని గుర్తు చేశారు. ఏవైనా మనం మనం సమస్యను పరిష్కరించుకుందామని చెప్పానన్నారు. రాష్ట్ర స్థాయి కేడర్లో 22వేల ఖాళీలు ఉన్నాయన్నారు. పంచుకోవాల్సింది 45వేల ఉద్యోగులను మాత్రమేనని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో 68వేల మంది పని చేసే వారు ఉన్నారన్నారు.
ఉద్యోగుల విభజన పైన ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కూర్చొని పరిష్కరించుకుంటే సమస్య పరిష్కారమవుతుందన్నారు. అసెంబ్లీ భవనాల కేటాయింపు పైన కూడా చర్చ జరిగిందన్నారు. రాబోయే రోజుల్లోను ఏమైనా సమస్యలు ఉన్నా మాట్లాడి పరిష్కరించుకుందామన్నారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయన్నారు.
తెలుగు రాష్ట్రాలు బాగుపడాలి
మార్కెట్ కమిటీ చైర్మన్లలో బీసీలకు అవకాశం కల్పిస్తామన్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు ముగిశాక తెలంగాణ సమావేశాలు పెట్టుకుందామని చెప్పారన్నారు. తెలంగాణ అన్ని రకాలుగా బాగుపడాలన్నదే తన కల అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుపడాలని ఆకాంక్షించారు. దళితులకు భూకేటాయింపుపై అంతటా హర్షం వ్యక్తమవుతోందన్నారు. దళితులకు న్యాయం జరగాలన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా దళితులకు వంద శాతం భూపంపిణి చేస్తామన్నారు.
నిర్మాణాత్మక నిర్ణయాలు అరవై రోజుల్లో జరగడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. దేనికైనా కొంత సమయం తీసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. చరిత్ర తెలియని వాళ్లే గాబరా పడతారన్నారు. సర్వేలో బ్యాంక్ అకౌంట్ చెప్పాలన్న జబర్దస్త్ లేదన్నారు. పెన్షన్ ఇవ్వాల్సి వస్తే అకౌంట్ వేయాలనే ఉద్దేశ్యంతోనే అకౌంట్ నెంబర్ అడుగుతున్నట్లు చెప్పారు. సర్వే పైన కేంద్రం హోంశాఖ నుండి అభ్యంతరాలు వ్యక్తమయినట్లుగా ఎలాంటి లేఖ రాలేదన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ బాలికల హాస్టల్ నిర్మిస్తామన్నారు. మార్కెటింగ్ కమిటీలలో, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ బాడీలలో 22 శాతం ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తామన్నారు.
కేసీఆర్ హిట్లరే
పాలన ఇప్పుడే మొదలైందని, తమ పైన అప్పుడే అక్కసు ఎందుకని ప్రశ్నించారు. గత ప్రభుత్వాల తెలివి తక్కువతనం వల్ల బాగా అవినీతి జరిగిందన్నారు. తప్పుడు పనులు, దొంగ వ్యవహారాలు చేసే వారికి కేసీఆర్ హిట్లరే అన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ పథకం మాండేటరీ కాదని, అది గత ప్రభుత్వం పథకమన్నారు.
టీడీపీ రాద్దాంతం, ఎవరికీ భయపడను
సర్వే పైన న్యాయస్థానం కూడా టీడీపీ నేతలకు మొట్టికాయ వేసిందన్నారు. ప్రజలు ఊహించుకొని కార్యక్రమాలను టీడీపీ నేతలు ఊహించుకొని రాద్దాంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పిచ్చి పిచ్చి చేస్తే కేసీఆర్ ఎవరికీ భయపడరన్నారు. గోల్కొండలో పండుగ చేసుకుంటామంటే తిక్కతిక్కగా మాట్లాడారన్నారు. గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు చేసుకుంటే చారిత్రక లిస్టులోకి వెళ్తుందన్నారు.
సర్వేపై వివరణ
సర్వేకు అందరు సహకరిస్తే మంచిదన్నారు. 19న ఆర్టీసి బస్సులు నడవవని చెప్పారు. సర్వేలో పాల్గొనేందుకు ప్రజలు సూరత్, గుజరాత్ నుండి వస్తున్నారన్నారు. 22 లక్షల రేషన్ కార్డులు ఎక్కువగా ఉండటం సిగ్గు చేటన్నారు. సర్వే ద్వారా సమాజ స్థితిగతులను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ సర్వే అర్హులను గుర్తించేందుకే అన్నారు. రాష్ట్రంలో ఏముందో, ఏం లేదో తెలుసుకునే హక్కు తమ ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.
ఆంధ్రావాళ్ల ఏరివేత అపోహ
సర్వేతో ఆంధ్రావాళ్లను ఏరివేస్తామనేది అపోహ మాత్రమే అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో చంద్రబాబుకు ఏం సంబంధమన్నారు. సర్వే వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఒక దృక్పథం ఏర్పడుతుందన్నారు. సర్వే అంతర్గతంగా చేయడం లేదని, దానికి జీవో జారీ అయిందన్నారు. సర్వే పైన విపక్షాల రాద్దాంతం ఎందుకో చెప్పాలన్నారు. మిస్సయిన వాళ్ల వివరాలు మళ్లీ తీసుకుంటామన్నారు.
కేంద్రం మంచిగుంటే మేం బాగుంటాం లేదంటే..
కేంద్రం
మాతో
మంచిగుంటే
మేం
మంచిగా
ఉంటామని,
లేదంటే
చెడ్డగా
ఉంటామన్నారు.
గోల్కొండలో
సంబరాలను
ప్రపంచవ్యాప్తంగా
అందరు
మెచ్చుకున్నారన్నారు.
ఫాస్ట్
పథకం
తెలంగాణకు
సంబంధించిందన్నారు.
కొన్ని
పార్టీల
మైండ్
సెట్
ఇంకా
మారటం
లేదన్నారు.
నాకు తెలిసిన చరిత్ర ఎవరికీ తెలియదు
తెలంగాణ వస్తే ఆంధ్రోళ్లకు ఏదో జరుగుతుందన్న హైప్ క్రియేట్ చేశారన్నారు. చరిత్ర గురించి తనకు తెలిసినంత ఎవరికీ తెలియదన్నారు. చరిత్ర తెలియని వాళ్లే గాబరా పడుతున్నారన్నారు. మహారాష్ట్ర గవర్నర్ కంటే మన రాష్ట్ర గవర్నర్కు ఏ ఒక్క బాధ్యత ఎక్కువగా లేదన్నారు.