కలిసుండి దొబ్బి తింటారా: ఆంధ్ర నేతలపై కెసిఆర్
హైదరాబాద్: ఆంధ్ర నేతలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విడిపోతే అడుక్కు తినాల్సి వస్తుందని సీమాంధ్ర నాయకులు అంటున్నారని, కలుసుండి దొబ్బి తింటారా అని ఆయన అడిగారు. లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులే అనే మాట రుజవవుతోందని ఆయన అన్నారు. తెలంగాణ ఎన్జీవోల సంఘం డైరీని ఆయన గురువారంనాడు ఆవిష్కరించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బిజెపి అగ్రనేత అద్వానీ కూడా షాక్ ఇచ్చారని, తెలంగాణ బిల్లు ఆమోదానికి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలుంటాయని అద్వానీ చెప్పారని ఆయన అన్నారు.
తెలంగాణ బిల్లును ఆమోదిస్తామని అద్వానీ కూడా చెప్పినట్లు ఆయన తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డికి ఒక్కటి కూడా సరిగా మాట్లాడడం రాదని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లుపై అభిప్రాయం పంపించే బాధ్యత కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీదే ఉందని ఆయన చెప్పారు. మద్రాసు నుంచి బయటకు రాక ముందే తెలంగాణను కబళించాలని ఆంధ్ర నేతలు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు, కిరణ్ రెడ్డి, జయప్రకాష్ నారాయణ రంగులు బయటపడ్డాయని ఆయన అన్నారు. తమ వ్యూహం కిరణ్ రెడ్డి అయ్య జట్లోంచి వచ్చినట్లుగా ఉందని ఆయన అన్నారు.
చంద్రబాబు ఆంధ్రలో తిరుగుతూ రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని కిరికిరి పెడుతున్నారని, ఏదైనా జరిగితే యుద్ధం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. బిల్లుపై అసెంబ్లీలో చర్చించినా చర్చించకున్నా బాధ లేదని, తెలంగాణను ఆపడం ఎవరి తరమూ కాదని ఆయన అన్నారు. బిల్లు ఆమోదం పొందకపోవడానికి ఒక్క ఆటంకం కూడా లేదని ఆయన అన్నారు. శాసనసభ సూచనలు మాత్రమే చేయవచ్చునని, అంతకు మించి దానికి అధికారం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన అంశం కేంద్రం చేతిలో ఉంటుందని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని ఆయన అన్నారు.
అంబేడ్కర్ దూరదృష్టితోనే రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని చేర్చారని, రాష్ట్రాల విభజన అధికారం కేంద్రం చేతిలో ఉండాలని అన్నారని ఆయన అన్నారు. ఆంధ్ర విడిపోవాలని కోరుకున్నప్పుడు తమిళనాడు శాసనసభ్యులు ఎక్కువ మంది ఉన్నారని, మెజారిటీ అభిప్రాయం మేరకు జరగాలంటే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయి ఉండేది కాదని ఆయన అన్నారు.
ఆంధ్ర నేతలు ఎంత మేయాలో అంత మేశారని ఆయన అన్నారు. తాము కూడా ఎంత దూరం వెళ్లాలో అంత దూరం వెళ్తామని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఎంత అరిచి గీపెట్టినా జనవరి 23వ తేదీ వరకేనని ఆయన అన్నారు. తెలంగాణను చెరలో బంధించి దోపిడీ చేశారని ఆయన విమర్శించారు. రేపు తెలంగాణ శాసనసభ్యులంతా పార్టీలకు అతీతంగా సమావేశమై శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తారని ఆయన చెప్పారు.
ఈ సమావేశంలో తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డి, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ, తెరాస ఎంపి జి. వివేక్ కూడా పాల్గొన్నారు.