పిపిఏలపై కెసిఆర్ సీరియస్: ఇండస్ట్రీల పాలసీపై రివ్యూ
హైదరాబాద్: దేశంలోనే ఉత్తమ పారిశ్రామిక విధానం రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం కొత్త పారిశ్రామిక విధానంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించే విధంగా పాలసీ ఉండాలని అన్నారు.
సింగిల్ విండో ద్వారా అనుమతులు పొందేలా చూడాలని చెప్పారు. త్వరితగతిన అనుమతి వచ్చేలా చేయాలని ఆదేశించారు. పరిశ్రమలు పెట్టని సంస్థల నుంచి ప్రభుత్వం కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంటామని కెసిఆర్ హెచ్చరించారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు రాయితీలు కల్పించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కెసిఆర్ అన్నారు. పిపిఏల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదనలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అవసరమైన సమాచారం తెప్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కావాల్సిన సమాచారం అందించడానికి విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిని ఢిల్లీలోనే కొద్ది రోజులపాటు ఉంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రానికి అవసరమయ్యే విద్యుత్ ఎక్కడి నుంచి తెప్పించుకోవాలనే అంశంపై కూడా చర్చించారు. కరెంటు విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కెసిఆర్ ఆదేశించారు.
రైతుల రుణమాఫీని తొందరగా అమలు చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కెసిఆర్ సమీక్షించారు. రుణమాఫీ వల్ల పడే ఆర్థిక భారంతోపాటు ఇతర వివరాలన్నీ కెసిఆర్ తెప్పించుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ చర్చించేందుకు వారం రోజుల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు.