మెట్రో పనులు పరుగెత్తాలి: కెసిఆర్, డిఆర్డివో యూనిట్
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సూచించారు. పోలీసులతో సమన్వయం చేసుకుని మెట్రో రైలు పనులు సాగించాలని ఆయన ఆదేశించారు. కె. చంద్రశేఖరరావు హైదరాబాద్ మెట్రోరైలుపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఎల్ అండ్ టీ ఛైర్మన్ గాడ్గిల్, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల మెట్రో రైలును ప్రయోగాత్మకంగా పరీక్షించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రయోగ పరీక్ష నివేదికతోపాటు మెట్రోరైలు ప్రాజెక్టు పనుల తాజా పరిస్థితిని కేసీఆర్కు వివరించారు.
ఇదిలావుంటే, నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ వద్ద డిఆర్డివో యూనిట్ను నెలకొల్పనున్నట్లు కెసిఆర్ తెలిపారు. వంద ఎకరాల్లో 1600 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు వస్తుందని ఆయన చెప్పారు. డీఆర్డివో యూనిట్ వల్ల వందలాది మందికి ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు.
డిఆరోడివో యూనిట్ స్థాపనకు వేగంగా అనుమతులు మంజూరు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. యూనిట్కు అవసరమైన నీళ్లు, విద్యుత్తు ఇస్తామని ఆయన చెప్పారు. దీనివల్ల విదేశీ అవసరాలు కూడా తీరుతాయని ఆయన చెప్పారు. నాగార్జున సాగర్ వద్ద ఎయిర్ స్ట్రిప్ను ఏర్పాటు చేస్తామని కెసిఆర్ చెప్పారు.