వైజాగ్ స్టీల్ పై కేసీఆర్ ప్లాన్ బూమరాంగ్ ? ఒక్కరోజులో గాలి తీసేసిన వైసీపీ సర్కార్...
ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను స్వాధీనం చేసుకునేందుకు తెలంగాణలోని కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే వార్తలు గత కొన్ని రోజులుగా గుప్పుమన్నాయి. తెలంగాణ సర్కార్ లీకులతో మొదలైన ఈ వ్యవహారం గత 24 గంటల్లో పూర్తిగా రూపుమారిపోయింది. దీనికి కారణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోరుతున్న బిడ్, కేంద్రం దీనిపై పెట్టిన ఆంక్షల్ని వైసీపీ సర్కార్ బయటపెట్టడమే.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కొనేస్తున్నామన్నట్టుగా కొన్ని రోజులుగా హడావిడి చేస్తున్న కేసీఆర్ సర్కార్ కు నిన్న ఒక్కరోజులోనే రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. వైజాగ్ స్టీల్ స్వాధీనం కోసం బిడ్ జరుగుతోందంటూ చేసుకున్న ప్రచారం అంతా ఒట్టిదేనని తేలిపోయింది. కేవలం ఈ ప్లాంట్ రన్ చేసేందుకు అవసరమైన పెట్టుబడి కోసం, అంటే భాగస్వామ్యంలో వాటా ఇచ్చేందుకు మాత్రమే ఆసక్తివ్యక్తీకరణ బిడ్ కోరినట్లు నిన్న వైసీపీ నేత సజ్జల పేపర్లు బయటపెట్టారు. అదే సమయంలో బీఆర్ఎస్ ఇందులో పాల్గొంటుందా అని ప్రశ్నించారు.

తాజా పరిణామాలతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సంబంధించిన బిడ్ పై కాకుండా కేవలం భాగస్వామ్యంలో వాటా ఇచ్చేందుకే నిర్వహిస్తున్న బిడ్ లో కేసీఆర్ ప్రభుత్వం పాల్గొంటున్నట్లు తేలిపోయింది. ఇందులోనూ అత్యధిక మొత్తం పెట్టే వారికే వైజాగ్ స్టీల్ ఈ వాటా ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంతో కేసీఆర్ ప్రభుత్వం చివరికి వైజాగ్ స్టీల్ లో కొంతమొత్తం వాటా కోసమే ఈ హంగామా అంతా చేసిందా అన్న ప్రచారం జరుగుతోంది.
మరోవైపు గతేడాది కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ అన్ని ప్రభుత్వాలకు ఓ మోమోరాండం జారీ చేసింది. దీని ప్రకారం ఏదైనా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధ ప్రైవేటీకరణ లేదా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతుంటే అందులో ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ రంగ సంస్ధలు కానీ పాల్గొనే అవకాశం లేదని తేల్చేసింది. ఈ లెక్కన చూసినా వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియలో కానీ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో కానీ బీఆర్ఎస్ సర్కార్ కు కానీ, సింగరేణి వంటి సంస్ధలకు కానీ పాల్గొనే అర్హత ఉండబోదు. దీంతో స్టీల్ ప్లాంట్ కాపాడేస్తాం అంటూ బీఆర్ఎస్ చేస్తున్న హంగామా అంతా ప్రచారం కోసమేనని తేలిపోయింది.












Click it and Unblock the Notifications