మెడలుపట్టి నెట్టినా పోనంటున్నారు: బాబుపై కెసిఆర్
నల్లగొండ: చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణలో ఏం పని అని, మెడపట్టి నెట్టినా చంద్రబాబు పోనంటున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు అన్నారు. పార్లమెంటులో ప్రత్యేక బిల్లును అడ్డుకున్న చంద్రబాబు, బిజెపి జాతీయ నేత వెంకయ్య నాయుడులకు ఏ శిక్ష విధించాలో నిర్ణయించాలని ప్రజలను కోరారు. పొత్తు వద్దంటూ తెలంగాణ బిజెపి నేతలు కుండ బద్దలు కొట్టినా వెంకయ్య, చంద్రబాబు జబర్దస్తీగా పొత్తు కుదిర్చారని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం నల్లగొండలో జరిగిన ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.
వెయ్యి కోట్లు ఖర్చు చేసైనా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి 25 సీట్లు తెచ్చి తమ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్కు సైతం మద్దతు ఇచ్చేందుకు వెనుకాడని నీచుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు సిఫారసుతో టిపిసిసి అధ్యక్షుడు అయిన పొన్నాలకు ప్రజల బాధలు ఎట్లా తెలుస్తాయని ప్రశ్నించారు. సీమకు దొంగతనంగా నీళ్లు పట్టుకుపోతుంటే పొన్నాల జెండా ఊపారని, డీకే అరుణ మంగళహారతులు పట్టారని ఆయన వ్యాఖ్యానించారు.

ఉద్యోగులకు ఆప్షన్లు వద్ద'ని మేమంటే 'అదేందంటూ జానారెడ్డి, పొన్నాల, రాజనరసింహ తప్పుబడుతున్నారని అంటూ వీళ్లేమైనా ఉద్యమజెండాలు పట్టారా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం తాము దీక్షలు చేస్తుంటే డిన్నర్ మీటింగులు పెట్టుకున్నారని అన్నారు. రావణుడు రాముడు అవుతడో కాడోగానీ, ఎగిరి గంతేస్తున్న పొన్నాల ఎన్ని ఫీట్లు చేసినా కెసిఆర్ స్థాయికి ఎదగలేవని, నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. టిడిపి, బిజెపి వాళ్లకు ఓట్లేస్తే వాళ్లు ఆంధ్రా వాళ్లకు అనుకూలంగా పని చేస్తారని ఆయన అన్నారు.
ఎర్రటి ఎండల్లో మాడి, లాఠీ దెబ్బలు తిన్న వాళ్లనే అభ్యర్థులుగా నిలిపానని, 17 స్థానాల్లోనూ వాళ్లని గెలిపిస్తేనే ఢిల్లీ మెడలు వంచి కావాల్సినవి సాధించుకోగలమని చెప్పారు. ఇవి ఆషామాషీ ఎన్నికలు కాదని అన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, ఆస్తుల పంపకం ఇంకా జరగలేదని, పూర్తిగా రాష్ట్రం ఏర్పడలేదని, ఆంధ్రోళ్లతో పంచాయితీ అయిపోలేదని ఆయన అన్నారు. రాష్ట్రం ఏర్పడినట్లు ప్రకటన జరిగినప్పటి నుంచీ ఏవో గొడవలు చేస్తూనే ఉన్నారని అన్నారు. భద్రాచలం డివిజన్లోని ఏడు మండలాలను ఆంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ తీసుకువచ్చారని, హైదరాబాద్లోని ఎన్ఐడీ ప్రాజెక్ట్ను విజయవాడకు తరలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని అన్నారు. నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్యను ఆయన ఎత్తిచూపారు.












Click it and Unblock the Notifications