బెజవాడలో సభ! బండారం బయటపెడ్తా: బాబుకి కేసీఆర్
హైదరాబాద్/వరంగల్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బండారం తాము బయటపెడతామని, అవసరమైతే విజయవాడలో తెరాస తరఫున ఓ సభను పెట్టి ఆంధ్రా సామాన్య రైతులు, పేదల పక్షాన కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం అన్నారు. మల్కాజిగిరిలో రూ.334 కోట్ల పురపాలక అభివృద్ధి నిధులతో నిర్మించనున్న తాగునీటి పథకానికి ఆదివారం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
సమైక్య రాష్ట్రంలో జీహెచ్ఎంసీలో అనాథలుగా బతికామన్నారు. హైదరాబాదు నీటి వ్యవస్థను గత ప్రభుత్వాలు సర్వనాశనం చేశాయన్నారు. మాటలు చెప్పడం కాదని, వాస్తవాలు చర్చించేందుకు తాము సిద్ధమన్నారు. చిన్న వర్షానికే గవర్నర్, ముఖ్యమంత్రి నివాసాల వద్ద నీరు వస్తోందని ఎద్దేవా చేశారు. నాలా భూముల కబ్జడాతో రహదారుల పైన నీరు చేరుతోందన్నారు.
తెలంగాణకు విద్యుత్ రాకుండా చేసింది చంద్రబాబేనని ఆరోపించారు. తాను ఎన్నికల ప్రచారం సమయంలో మూడేళ్లు విద్యుత్ కష్టాలు ఉంటాయని చెప్పాని తెలిపారు. విద్యుత్ విషయంలో తాను ఎప్పుడు అబద్దాలు చెప్పలేదన్నారు. మా ప్రజాప్రతినిధులు బ్రహ్మాండంగా పని చేస్తున్నారన్నారు.
పనికిమాలిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మాటలు నమ్మవద్దన్నారు. ఆరు నూరైనా తాము పేదల పక్షాననే ఉంటామన్నారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని చెప్పారు. చివరకు తన నియోజకవర్గంలోను తాను ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని కేసీఆర్ చెప్పారు.
తనకు ధైర్యం ఉంది కాబట్టే ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వలేదని, విద్యుత్ కష్టాలు ఉంటాయని చెప్పానన్నారు. చంద్రబాబు తన రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆరోపించారు. ఆయనలా తాను దొంగమాటలు చెప్పలేదన్నారు. నా తాత జేజమ్మ దిగి వచ్చినా విద్యుత్ సమస్య తీర్చలేరన్నారు.
కాంగ్రెస్, టీడీపీల నుండి వారసత్వంగా వచ్చిన ఈ దరిద్రం విద్యుత్ సమస్య అన్నారు. ఇంకా ఆ పార్టీల నేతలు బస్సుయాత్రలు చేయడం విడ్డూరమన్నారు. కృష్ణా బోర్డు తీర్పును మెడమీద తలకాయ ఉన్న వారు ఎవరు సమర్థించరన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే జంట నగరాలలో పక్కా ఇల్లు, నల్లాలను నగరవాసులకు ఇచ్చే కార్యక్రమం చేపడతామన్నారు. నాలుగేళ్లలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తామన్నారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు.