అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన, నాది పొలిటికల్ లైన్ కాదు: కెసిఆర్
నల్లగొండ: తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అన్నారు. సోమవారం నాగార్జునసాగర్లోని విజయవిహార్లో జరిగిన టీఆర్ఎస్ మూడో రోజు శిక్షణా తరగతుల్లో ఆయన ప్రసంగించారు. తనది రాజకీయ పంథా కాదని, తనది సాంస్కృతిక పంథా అని ఆయన చెప్పుకున్నారు.
తాను 70వేల నుంచి 80 వేల పుస్తకాలు చదివానన్నారు. తనది పొలిటికల్ లైన్ కాదు..కల్చరల్ లైనని స్పష్టం చేశారు. ఎవ్వరమూ వెయ్యి సంవత్సరాలు బతకడానికి రాలేదని, డబ్బులు సంపాదించుకోవడమే పరమావధి ఐతే పేడ అమ్ముకున్నా డబ్బులొస్తాయని అన్నారు. మనం చాలా గొప్ప అనుభవాలు పంచుకున్నామని చెప్పారు.
ఉద్యమం మొదలైన నాడు ఐతదా పోతదా అని చాలా మంది అన్నారని, తెలంగాణను కష్టపడి సాధించుకున్నమని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి తరం ప్రజాప్రతినిధులుగా మీ పేరు నిలిచిపోతదని ఆయన అన్నారు. మీరంతా అవినీతికి ఆమడ దూరంలో ఉండి ప్రజలతో మమేకమవ్వాలని ప్రజాప్రతినిధులకు దిశానిర్ధేశం చేశారు.
గుంట పొలం కూడా కరెంట్ కారణంగా ఎండిపోవద్దని నేతలకు ఉద్ఘాటించారు. ఏ ముఖ్యమంత్రి చూడనట్వంటి దేవాలయాలు తాను చూశానన్నారు. దాశరథి పేరుతో అవార్డు ఇవ్వాలని గత పాలకులు ఏనాడైన అనుకున్నారా అని ఆయన అడిగారు.
నాగార్జునసాగర్లోని బుద్దవనాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సందర్శించారు. సోమవారం బుద్ద పౌర్ణిమ కావడంతో బుద్ద వనాన్ని సందర్శించి అక్కడ మొక్కలు నాటారు. సీఎంతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగార్జునసాగర్ను బుద్ధ గయ మాదిరిగా తీర్చి దిద్దుతానని కెసిఆర్ చెప్పారు.
నాగార్జునసాగర్ను ప్రపంచస్థాయి బౌద్ధక్షేత్రంగా తీర్చి దిద్దుతామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. ప్రపంచంలోని బౌద్ధులంతా నాగార్జునసాగర్కు వెళ్లి రావాలనుకునే రీతిలో శ్రీపర్వతారామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. శ్రీపర్వతారామాభివృద్ధి కోసం యాదగిరిగుట్ట మాదిరిగా ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేస్తామని ఆ అధికారి పూర్తి కాలం ఇక్కడే ఉండి పనిచేస్తారని వెల్లడించారు.
అదనంగా కృష్ణా తీరంలో మరికొంత స్థలాన్ని కేటాయించి బుద్దభవనాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. నాగార్జునసాగర్ రాష్ట్రంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా మారాలని ఇందు కోసం త్వరలో హైదరాబాద్లో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.