గ్రేటర్ ఎఫెక్ట్, డల్లాస్లా హైద్రాబాద్: కేసీఆర్, తెరాసలోకి జగన్ పార్టీ గట్టు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదును అమెరికాలోని డల్లాస్ నగరంగా తయారు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. కొంపల్లిలో జరిగిన తెరాస విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను వట్టి మాటలు చెప్పడం లేదని, హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు.
ఎవరూ ఊహించనిరీతిలో హైదరాబాదును సుందరంగా తయారు చేస్తామన్నారు. హైదరాబాదులో దాదాపు కోటి జనాభా ఉందన్నారు. అందుకు అనుగుణంగా సదుపాయాలు లేవన్నారు. ఏ ఒక్కటి కూడా సరిగా లేదన్నారు. వర్షం వస్తే రోడ్లన్నీ నీటితో నిండిపోతాయన్నారు. కొందరైతే బకెట్లు పట్టుకొని ఇంట్లోకి వచ్చిన నీటిని తోడేస్తారని ఎద్దేవా చేశారు. కాగా, త్వరలో గ్రేటర్ ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇలా మాట్లాడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
20వ తారీకు నుండి గ్రేటర్ హైదరాబాదులో పేదలు ఆక్రమించుకున్న భూములను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. తెరాసలో సభ్యత్వం తీసుకుంటే రెండు లక్షల రూపాయల ఇన్సురెన్స్ ఉంటుందన్నారు. సిక్కు యువతులకు కూడా కల్యాణ లక్ష్మీ వర్తింప చేస్తామన్నారు.
హైదరాబాదును రియల్ స్మార్ట్ సిటీగా మారుస్తామన్నారు. ప్రతిపక్షాల మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. సచివాలయాన్ని అమ్ముతారా అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయని ఎద్దేవా చేశారు. పంజాగుట్ట, మలకపేటలలోని ప్రభుత్వ కార్యాలయాలు కూల్చి వ్యవసాయ మార్కెట్లు కడతామన్నారు.
సభ్యత్వ నమోదు తేదీని పొడిగించేది లేదన్నారు. మూడేళ్ల తర్వాత రైతులకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తామన్నారు. బడ్జెట్ తర్వాత దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు. త్వరలో అమరవీరుల రెండో జాబితాను విడుదల చేస్తామన్నారు.
తెరాసలోకి వైసీపీ నేత గట్టు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గట్టు రామచంద్ర రావు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆయన ఇటీవలి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాష్ట్ర విభజన, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అంతగా లేకపోవడంతో గట్టు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు తెరాసలో చేరారు.