మోతుబరులం, మాది ధనిక రాష్ట్రమని ఎప్పుడో చెప్పా: కెసిఆర్
హైదరాబాద్: విడిపోతే తెలంగాణ ధనిక రాష్ట్రమని తాను దాదాపు 16 ఏళ్ల నుంచీ చెబుతూ వస్తున్నానని, అది నిజమని తేలిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలని 14వ భారత ఫైనాన్స్ కమిషన్ ధనిక రాష్ట్రాలుగా ప్రకటించిందని ఆయన చెప్పారు. వెనకబడిన 11 రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చిందని, వాటికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడాన్ని తాను సమర్థిస్తున్నానని, అయితే తమ రుణపరిమితిని పెంచాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తాను ఈ విషయంపై గుజరాత్ ముఖ్యమంత్రితో మ్టాలాడానని, రుణపరిమితి పెంపు కోసం కేంద్రంతో మనం పోరాటం చేయాలని సూచించినట్లు ఆయన తెలిపారు.
రైల్వే బడ్జెట్కు సంబంధించి తెలంగాణకు ఒక రకంగా మంచి జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రంగా ఏర్పడడం వల్ల తెలంగాణకు కొన్ని పథకాలు వచ్చాయని ఆయన చెప్పారు. అయితే, కోచ్ ఫ్యాక్టరీ వంటివి ఇంకా రావాల్సి ఉందని, ఎప్పుడు కూడా అడిగనవన్నీ కేంద్రం ఇవ్వదని, వాటి కోసం పట్టుబడుతూనే ఉండాలని ఆయన అన్నారు. వేసవిలో కరెంట్ కోత ఉండదని, యధాతథ స్థితి కొనసాగుతుందని కెసిఆర్ చెప్పారు.
రాష్ట్రంలోని లక్షా 70 వేల మంది బీడీ కార్మికులకు నెలకు వేయి రూపాయల చొప్పున భృతి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 4 లక్షల 90 వేల మంది బీడీ కార్మికులున్నారని, వీరిలో లక్షా 40 వేల మంది ఆసరా కింద ప్రయోజన పొందుతున్నారని, మరో లక్ష మంది కేంద్రం ఇచ్చే ప్రావిడెంట్ ఫండ్ పొందుతున్నారని ఆయన అన్నారు .ఒక్కరే రెండు మూడు పథకాల కింద ప్రయోజనం పొందడం సరి కాదని ఆయన అన్నారు. ఇతర పథకాల కింద ప్రయోజనం పొందని బీడి కార్మికులే వేయి రూపాయల భృతికి అర్హులని ఆయన చెప్పారు.
కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, అర్హులందరికీ భృతి అందాలనేదే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. ఎవరైనా న్యాయబద్దంగా పొందాల్సిన బీడీ కార్మికులు ఉంటే ఎమ్మార్వో కార్యాలయంలో తెలియజేసుకోవాలని, 15 రోజుల్లో ఆ సమస్య పరిష్కారమవుతుందని ఆయన అన్నారు. వాటిపై ధర్నాలు, ఆందోళనలు చేయకూడదని ఆయన అన్నారు. ధర్నాలు, ఆందోళనల వల్ల ఏమీ కాదని ఆయన అన్నారు. న్యాయంగా పొందాల్సినవారందరికీ ఆ సాయం అందుతుందని అయన పదే పదే చెప్పారు.
మంత్రి జగదీష్ రెడ్డిపై కాంగ్రెసు నేత పొన్నం ప్రభాకర్ చేసిన అవినీతి ఆరోపణలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, కెసిఆర్ స్పందించారు. మంత్రి కేసు కూడా పెట్టారని, అడ్డగోలు ఆరోపణలు చేస్తే సరి కాదని, దారిన పోయే దానయ్యను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
కేరళలోని కాయంకుళం నుంచి 500 మెగావాట్ల విద్యుత్ వస్తుందని తెలిపారు. కరెంట్ విషయంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితే కొనసాగుతుందని అన్నారు. ఏపీలో కలిసిన ఏడు మండలాలను రాష్ట్రం నుంచే విద్యుత్ను అందిస్తున్నామని తెలిపారు. విభజన చట్టం ప్రకారం ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ రాష్ట్రానికి రావడం లేదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4300 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంది. హైడ్రో పవర్ 2300 మెగావాట్లు ఉందని తెలిపారు. ఈ ఏడాది చివరి కల్లా 2వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తదని పేర్కొన్నారు. 2017 నాటికి వరకు రైతులకు 12 గంటల కరెంట్ ఇవ్వనున్నట్టు తెలిపారు. 2018 కల్లా మనమే 2,3 వేల మెగావాట్ల విద్యుత్ ను అమ్ముతమని అన్నారు. 2018 కల్లా తెలంగాణ సర్ ప్లస్ విద్యుత్ రాష్ట్రం అవుతుందని వెల్లడించారు. వందశాతం కరెంటు సమస్య రాకుండా చూస్తామని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.