కెసిఆర్పై రాజకీయ నిర్భయ కేసు పెట్టాలి: రేవంత్ రెడ్డి వ్యాఖ్య
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై రాజకీయ నిర్భయ కేసు పెట్టాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణను అడ్డుకున్నవారికే కెసిఆర్ ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్సించారు.
తెలంగాణ కోసం కష్టపడిన కోదండరామ్, దేవీప్రసాద్, జయశంకర్ కుటుంబాలకు గానీ అమరవీరుల కుటుంబాలకు గానీ కెసిఆర్ పదవులు ఇవ్వలేదని ఆయన అన్నారు. విలువలతో కూడిన రాజకీయం అని చెప్పిన కెసిఆర్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తప్పు పట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఆత్మసాక్షిగా ఓటేసి కెసిఆర్కు గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలందరూ ఆత్మప్రభోదంతో ఓటు వేసి, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని రేవంత్రెడ్డి కోరారు. అసెంబ్లీ కార్యదర్శి, గవర్నర్, స్పీకర్ వ్యవస్థలను ముఖ్యమంత్రి కేసీఆర్ అగౌరవపర్చారని ఆయన అన్నారు. సుప్రీం తీర్పు ప్రకారం చెన్నమనేని రమేష్కు ఓటు హక్కు లేదని, చెన్నమనేని విషయంలో అవసరమైతే కోర్టుకెళ్తామని ఆయన అన్నారు.
తమ పార్టీకి మెజార్టీ ఉందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తామని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతిచ్చినా తాము స్వీకరిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాజ్యసభ తరహాలో బహిరంగ ఓటింగ్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అరికెల నర్సారెడ్డి సీనియర్ నాయకుడు, పార్టీ నిర్మాణంలో ఆయన శ్రమ ఉందని, నర్సారెడ్డికి న్యాయం చేయాలని చంద్రబాబును కోరామని, చంద్రబాబు తప్పకుండా అరికెలకు న్యాయం చేస్తారని రేవంత్రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications