వారివల్లే: కేసీఆర్, టి కాదు, సింగపూర్తోనే: లోకేష్ సెటైర్
నిజామాబాద్/హైదరాబాద్: గత ప్రభుత్వాల తప్పుడు విధానం వల్ల రూ.వేలకోట్లు దుర్వినియోగం అయ్యాయని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాలు మాటలు చెప్పాయే తప్ప చేతల్లో చూపలేదన్నారు. ఆర్మూరులో తాగునీటి కష్టాలు లేకుండా చూస్తామన్నారు. త్వరలో రుణమాఫీ చేస్తామన్నారు.
నాలుగేళ్లలో నల్లా కనెక్షన్ లేని ఇళ్లు ఉండకుండా చేస్తామన్నారు. ఆర్మూర్ మంచినీటి పథకాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలన్నారు. ఆర్మూరులో 100 పడకల ఆసుపత్రి, కోర్టును ఏర్పాటు చేస్తామన్నారు. దసరా, దీపావళి మధ్య కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు ఇస్తామన్నారు. రైతులకు ఎర్రజొన్న బకాయిలు వారంలో అందిస్తామన్నారు. త్వరలోనే రుణమాఫీ అమలు అవుతుందని చెప్పారు. ఆర్మూరులో మంచి మున్సిపాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామన్నారు.
ఆర్మూరులో తాగునీటిని శుద్ధి చేసే పథకాన్ని సంవత్సరంలోగా తీసుకువస్తామన్నారు. ఆటో రిక్షాలకు ఇప్పటికే రవాణా పన్ను రద్దు చేశామన్నారు. పేదలకు 3.5 లక్షల రూపాయలతో ఇళ్ల నిర్మాణాలు చేపడతామన్నారు. ఆర్మూరులో 114 కోట్ల రూపాయలతో తాగునీటి పథకానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ పథకానికి శంఖుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఏడాదిలోగా దీనిని పూర్తి చేస్తామన్నారు.
అంకాపూర్ రైతులపై వరాల జల్లు
ఆర్మూర్ మండలంలోని ఆదర్శ గ్రామం అంకాపూర్కు కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. గ్రామ రైతులతో ముఖాముఖి నిర్వహించారు. పంటల రక్షణ కోసం రూ.1.50 కోట్లతో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. పసుపు యంత్రాల కోసం రూ.1.25 కోట్ల సమకూర్చుతామన్నారు. విత్తన ఉత్పత్తి క్షేత్రాల అభివృద్ధికి ప్రభుత్వం చేయూత అందిస్తుందన్నారు. అలాగే రైతులు నీటిని నిల్వ చేసుకునే తొట్టెలకు ప్రభుత్వం 50 శాతం రాయితీ అందిస్తుందన్నారు.
లోకేష్ ఎద్దేవా
కేసీఆర్ పైన టీడీపీ కార్యకర్తల నిధినిర్వహణ చైర్మన్ లోకేష్ మండిపడ్డారు. కృష్ణా జిల్లాలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఆరంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ముఖ్యమంత్రులంతా అభివృద్ధి చేసిన హైదరాబాదులో కేసీఆర్ ఏదో చేస్తున్న భ్రమలు కల్పించి, సవాళ్లు విసరడమేమిటని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు ఉన్న సౌకర్యాలు, కంపెనీలు, నిధులు, పన్నురాబడులు, నీళ్లు, ప్రాజెక్టులపై శ్వేత పత్రాలు విడుదల చేసిన తర్వాత కేసీఆర్ అభివృద్ధి చేసినట్టు భ్రమల్లోకి వెళ్లారన్నారు. ఎక్కడికెళ్తే అక్కడ హామీలు ఇవ్వడం మినహా ఏం చేశారన్నారు.
ఏపీతో అభివృద్ధిలో పోటీపడితే అప్పుడు కేసీఆర్ మాటలు చెల్లుబాటవుతాయన్నారు. అధికారంలోకి వచ్చిన ఇన్నాళ్లకు రాష్ట్రం తీరుతెన్నులపై అవగాహనలేని కేసీఆర్ ఏదో ఒకటి మాట్లాడి, వివాదం రేపి ప్రజల్లో ఇమేజ్ సంపాదించుకోవాలని చూస్తున్నారన్నారు. మాటల సీఎంగా కాకుండా చేతల సీఎంగా నిరూపించుకోవాలన్నారు. అధికారం చేపట్టి 2 నెలలు కాకుండానే రైతులు, విద్యార్థులపై లాఠీఛార్జ్, దౌర్జన్యాలు తప్ప కేసీఆర్ తెలంగాణకు చేసిన మంచి పనేంటో చెప్పాలన్నారు. తమ పోటీ సింగపూర్తోనేనని, తెలంగాణతో కాదన్నారు. కాగా, ఏపీలో రుణమాఫీ అంశం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సంబంధించిన అంశమన్నారు.