సవాల్కు సై, జైళ్లోనే...: బాబుపై దుమ్మెత్తిపోసిన కెసిఆర్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాబు పదవి కోసం సొంత మామకు వెన్నుపోటు పొడిచారంటూ ఏకీపారేశారు. మంగళవారం కెసిఆర్ పైన చంద్రబాబు నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. తెలంగాణలో అంతో ఇంతో అభివృద్ధిని తానే చేశానని, దీనిపై చర్చకు రావాలని బాబు సవాల్ విసిరారు.
ఈ సవాల్ను కెసిఆర్ స్వీకరిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో ఆయనపై దుమ్మెత్తి పోశారు. చంద్రబాబు తన హయాంలో నకిలీ ఎన్కౌంటర్లు చేయించారని ధ్వజమెత్తారు. బాబు లాంటి వాళ్ల నుండి తెలంగాణను కాపాడేందుకే తాను రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నానన్నారు. తెలంగాణలో చంద్రబాబు చేసిన అభివృద్ధిపై తాను ఎప్పుడైనా సిద్ధమన్నారు. మోసం, అవకాశవాదం, నమ్మకద్రోహం, వెన్నుపోటు కలిస్తే చంద్రబాబు అవుతారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు మాదిరిగా తాను అక్రమాస్తులు సంపాదించుకోలేదని, చీకట్లో సింగపూర్ యాత్రలు చేయలేదని, చీకట్లో చిదంబరాన్ని కలవలేదన్నారు. తాను ఫాంహౌస్లో పడుకుంటే ఆయనకేమిటన్నారు. చంద్రబాబులా హైదరాబాదులో ఉండి లక్షల కోట్ల విలువైన తెలంగాణ భూములను వైయస్, చంద్రబాబు అమ్మేశారన్నారు. తాను పద్నాలుగేళ్లుగా తెలంగాణ ప్రజలకు ఏం చేశానో అందరికీ తెలుసునన్నారు.
బాబులాంటి వికృత మనస్థత్వం ఎవరికీ లేదన్నారు. పదవి కోసం సొంత మామకు వెన్నుపోటు పొడిచాడన్నారు. బాబులాంటి నాయకులు తమ దేశంలో ఉంటే పిచ్చాసుపత్రిలోనే, జైళ్లలోనే ఉండేవారని స్విట్జర్లాండు ఆర్థికమంత్రి చెప్పారన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆందోళన చేస్తే రైతులను తుపాకులతో కాల్చాడన్నారు. బాబు చేసిన దుర్మార్గాలకు అలిపిరిలో అనుభవించాడని దుయ్యబట్టారు. బాబుతో తాను ఎప్పుడైనా చర్చకు సిద్ధమని, దమ్ముంటే బహిరంగ చర్చ పెట్టాలని, స్థలం ఆయనే చెప్పాలన్నారు.
బాబులాగా తాను నిత్యం హైదరాబాదులో ఉండి ఇతరులకు గోతులు తవ్వనన్నారు. తాను రాష్ట్రపతికి చెప్పే అప్పుడు ఆమరణ దీక్ష చేశానని, బాబులా దొంగ దీక్షలు చేయలేదన్నారు. వ్యవసాయం దండుగ అని బాబు చెప్పారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పేరు మీద ఉత్తరం రాసి హుజూరాబాదులో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. చంద్రబాబు ఆస్తుల పైన లోకాయుక్త విచారణ చేపడితే హైకోర్టుకు పోయి తప్పించుకున్నాడని విమర్శించారు. బాబులా తాను లఫూట్ పనులు చేయలేదన్నారు. బాబు కుట్రలను బిల్ క్లింటన్ ముఖం మీద ఉమ్మేసినట్లు తిట్టిపోయారన్నారు.
మరోవైపు వైయస్ జగన్ సొంత ప్రయోజనాల కోసమే పర్యటనలు చేస్తున్నారని తెరాస సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
ఆ ఇద్దరు నాశనం చేస్తున్నారు: చంద్రబాబు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని అంతకుముందు చంద్రబాబు సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస నాయకులతో అన్నారు. జగన్ సమైక్యం ముసుగులో విభజనకు మద్దతు పలుకుతున్నారన్నారు. వారికి రాష్ట్రంపై కనీస పరిజ్ఞానం లేదన్నారు.












Click it and Unblock the Notifications