అభిమానం: గణేష్ మండపంలో కెసిఆర్ మట్టి విగ్రహం
మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఉన్న అభిమానాన్ని ఆయన అభిమానులు మరోసారి చాటుకున్నారు. మెదక్ జిల్లా పటాన్చెరుకు చెందిన ఓ యువకులు కెసిఆర్పై తనకున్న అభిమానాన్ని వినూత్న రీతిలో ప్రదర్శించాడు.
శ్రీనగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరులో 36 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీని పక్కనే కెసిఆర్ మట్టి ప్రతిమను కూడా పెట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేతగా కెసిఆర్ తమ హృదయాల్లో ఉన్నారని.. అందుకు నిదర్శనంగానే గణేష్ మండపంలో కెసిఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు యువకులు చెబుతున్నారు.
ఇంతకు ముందు కూడా ఇలాంటి అభిమాన ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. ఎలక్ట్రికల్ షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్న కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన పోలం సతీష్ యాదవ్ కూడా తన అభిమానాన్ని చాటుకున్నారు.
తన షాపులో దేవుడి చిత్రాల పక్కనే కెసిఆర్ చిత్ర పటాన్ని కూడా పెట్టాడు. దేవుళ్లతో పాటు కెసిఆర్ చిత్ర పటానికి అతడు ప్రతి రోజు పూజలు చేస్తున్నాడు. అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసిన కెసిఆర్ నిజంగా దేవుడిలా భావించిన సతీష్.. పెద్దపల్లిలోని తన షాపులో కెసిఆర్ చిత్ర పటానికి నిత్యం పూజలు చేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు.