చంద్రబాబు ఫోన్ సంభాషణలపై ఆచితూచి: రేవంత్ రెడ్డి ఇష్యూపై కెసిఆర్
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్ట్ఫీన్ సన్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్లో మాట్లాడినట్టు ఉన్న ఆధారాలపై ఆచితూచి వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో టిడిపి ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అరెస్టు, అలాగే ఇదే కేసులో ఎమ్మెల్యే స్టీఫెన్ సన్తో చంద్రబాబు నాయుడు ఫోన్లో సంభాషణ తదితర అంశాలపై గురువారం ముఖ్యమంత్రి కెసిఆర్తో అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్ జనరల్ ఎకె ఖాన్, ఇంటెలిజెన్స్ ఐజి శివధర్రెడ్డి సమావేశమై చర్చించారు.
చంద్రబాబుపై కేసు పెట్టాలనే యోచనలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు కెసిఆర్తో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి కేసులో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై కెసిఆర్ ఉన్నతాధికారులతో చర్చించినట్లు చెబుతున్నారు.
ఓటుకు నోటు కేసులో రేవంత్రెడ్డి నోటుకు ఓటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్తో ఫోన్లో మాట్లాడినట్టు ఆధారాలు తమ వద్ద ఉన్నాయని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కూడా కెసిఆర్ వద్ద ఉన్నతాధికారులు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండటంతో దీనిపై ఎవరు మాట్లాడకపోవడమే మంచిదని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్టు తెలిసింది.
చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఫోన్ సంభాషణలపై తొందర పడవద్దని, త్వరలో తాను ఢిల్లీ వెళ్తున్నానని, అక్కడ కొందరు పెద్దలతో మాట్లాడి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి సూచించినట్టు చెబుతున్నారు. రేవంత్రెడ్డి ఉదంతంలో మొదటి ముద్దాయిగా చంద్రబాబును చేర్చాలని, ఈ కేసు ఇరు రాష్ట్రాల రాజకీయాలలో దుమారం సృష్టించనుందని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి వరంగల్లో చేసిన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రితో పోలీసు ఉన్నతాధికారుల భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
ఓటు నోటు కేసులో నేరుగా ఒక ముఖ్యమంత్రికి ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో కేసు పెట్టాలా? వద్దా? అనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ అంశంపై కేంద్రంతో, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో చర్చించిన తర్వాతనే ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. రేవంత్రెడ్డి ఉదంతానికి సంబంధించిన వీడియో, ఆడియో టేపుల ఫుటేజిలను అవినీతి నిరోధకశాఖ, ఇంటెలిజెన్స్ అధికారులు ముఖ్యమంత్రికి అందజేసినట్టు తెలిసింది.
ఇలా ఉండగా ఈ నెల 12న ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడు తీసుకెళ్లే అవకాశం ఉందని తెలిసింది. ఈ సందర్భంగా కెసిఆర్ మోడీతో సమావేశమయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.