ఎమ్మెల్యేగా కెసిఆర్ ప్రమాణం: స్పీకర్గా చారి ఏకగ్రీవమే
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సభలో శాసనసభ్యుడిగా దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. కెసిఆర్ చేత ప్రోటెం స్పీకర్ జానారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం తెలంగాణ మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు. తర్వాత మహిళా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కొనసాగింది. సోమవారం శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం ముగిసింది.
కాగా, శాసనసభ స్పీకర్ పదవికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు మధుసూదనాచారి నామినేషన్ దాఖలు చేశారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం జరగడానికి తెరాస నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటలకు నామినేషన్ల గడువు ముగుస్తుంది. తెరాస నాయకుల ప్రయత్నాలు ఫలించాయి. మధుసూదనాచారి స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. ఆయన ఎన్నికను రేపు మంగళవారం ప్రకటిస్తారు.

ఇదిలావుంటే, మజ్లీస్ శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ, ముంతాజ్ సోమవారం శాసనసభకు హాజరు కాలేదు. శాసనసభా సమావేశాల ప్రారంభానికి ముందు తెరాస సభ్యులు అమరవీరులకు నివాళులు అర్పించారు. గన్పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ లోగోలో ఉర్దూ లేనందకు నిరసనగా తొలుత ప్రమాణస్వీకారం చేసేందుకు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ నిరాకరించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కెసిఆర్తో మాట్లాడుతామనడిప్యూటీ సీఎం మహమూద్ అలీ హామీ ఇవ్వడంతో షబ్బీర్ అలీ ప్రమాణం చేశారు.
తెలంగాణ శాసనమండలి సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మండలిలో 30 మంది ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు శాసనమండలి శ్రద్దాంజలి ఘటించారు. తరువాత మండలి బుధవారానికి వాయిదా పడింది. వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్సీలు ప్రభాకర్రావు, లక్ష్మీనారాయణ సభకు గైర్హాజరయ్యారు.












Click it and Unblock the Notifications