ఏపీలోనూ చంద్రబాబును వదలని కేసీఆర్ : కీలక ఓట్ బ్యాంక్ పై గురి - లెక్క మారేది అక్కడే..!?
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటోంది. కొత్త పొత్తులు తెర పైకి వస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖాయమైంది. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిసే అవకాశాలు లేవని చెబుతున్నా..చంద్రబాబు..పవన్ మాత్రం ఇంకా వేచి చూసే ధోరణితో ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న బీఆర్ఎస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త పొత్తులతో అడుగులు వేస్తోంది. తాజాగా ఖమ్మంలో జరిగిన సభలోనూ విపక్ష పార్టీల ప్రభుత్వం అంటూ కొత్త నినాదం తెర మీదకు తీసుకొచ్చారు. తెలంగాణ ఎన్నికల నుంచే మైత్రి కొనసాగించేందుకు సిద్దం అవుతున్నారు. ఏపీలోనూ ఈ పొత్తులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ కొత్త పొత్తులతో టీడీపీ ఓట్ బ్యాంక్ పై కేసీఆర్ గురి పెట్టినట్లు కనిపిస్తోంది..మరి గురి కుదురుతుం
బీఆర్ఎస్ కు ఆప్- వామపక్షాల మద్దతు
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఖమ్మం సభ ద్వారా తన అడుగులు స్పష్టం చేసారు. ముందుగా తెలంగాణ ఎన్నికల్లో విజయం..ఆ తరువాత సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా కేసీఆర్ లక్ష్యంగా ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ - వామపక్షాల మధ్య పొత్తు కుదిరింది. వామపక్షాల మద్దతు తో టీఆర్ఎస్ విజయం దక్కించుకుంది. ఈ పొత్తు తెలంగాణ కే పరిమితం కాదని, జాతీయ స్థాయిలోనూ కొనసాగుతుందని ఇప్పటికే స్పష్టం చేసారు. ఇప్పుడు ఆప్ నేతలు ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణలో ఆప్ కు పెద్దగా బలం లేదు. కానీ, జాతీయ స్థాయిలో భవిష్యత్ ప్రయోజనాల కోసం తెలంగాణలోనూ కలిసి వెళ్తారని ప్రచారం సాగుతోంది.
ఏపీలో కొత్త పాత్తులతో కేసీఆర్ ఎంట్రీ
బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా సీఎం కేసీఆర్ ఏపీ పైన ఫోకస్ పెట్టారు. వచ్చే నెల మొదటి వారంలో విశాఖ కేంద్రంగా బీఆర్ఎస్ సభ నిర్వహణకు నిర్ణయించారు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఇప్పటికే ఏపీకి చెందిన కొందరు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభకు ఏపీ నుంచి 150 బస్సుల్లో తరలి వెళ్లారు. ప్రస్తుతం ఏపీలో వామపక్షాలు టీడీపీకి మద్దతుగా ఉన్నాయి. టీడీపీ - జనసేనకు బీజేపీతో పొత్తు కుదిరితే వామపక్షాలు దూరం కానున్నాయి. ఇదే సమయంలో ఏపీలోనూ వామపక్ష పార్టీలు బీఆర్ఎస్ తో కలిసేలా ఢిల్లీ కేంద్రంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అదే సమయంలో ఆప్ తోనూ ఏపీలో కలిసి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. దీని ద్వారా బీజేపీ కలిస్తే మూడు పార్టీలు..లేకపోతే టీడీపీ - జనసేన పార్టీల పొత్తు పరిమితం అయ్యే అవకాశం ఉంది. దీంతో..ఆ రెండు పార్టీల ఓట్ బ్యాంక్ పైన కేసీఆర్ గురి పెట్టినట్లు స్పష్టం అవుతోంది.
ఏపీలో కేసీఆర్ వ్యూహాలు ఫలించేనా
ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు పైనే టీడీపీ - జనసేన నమ్మకం పెట్టుకున్నాయి. జగన్ పాలన పైన పెద్ద ఎత్తున వ్యతిరేక ఉందని నమ్ముతున్నాయి. ఇదే సమయంలో వ్యతిరేక ఓటు చీలకుండా తాము పొత్తు పెట్టుకుంటున్నట్లు చెబుతున్నాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ కొత్త పొత్తులతో ఏపీలో బరిలోకి దిగితే హోరా హోరీ పోటీ నియోజకవర్గాల్లో చీలిక ఓట్లు ఫలితాలను తారు మారు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే టీడీపీ - జనసేన ఈ సారి బలంగా నమ్ముకున్న కాపు ఓటింగ్ పైన బీఆర్ఎస్ గురి పెట్టింది. అదే విధంగా..ఆప్ కు మధ్యతరగతి, యువతలో కొంత ఆకర్షణ ఉంది. సీనియర్ సిటిజన్స్ ఆప్ వైపు ఆసక్తి చూపుతున్నారు. వైసీపీ - టీడీపీ ని వ్యతిరేకించే తటస్థులు ఆప్ కు మద్దతు ప్రకటించే అవకాశం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో.. బీఆర్ఎస్ కొత్త పొత్తులు వైసీపీకీ ఏ మేర లాభం చేస్తుందనే దాని కంటే.. టీడీపీ - జనసేన ఓట్ బ్యాంకు కు మాత్రం ఎంతో కొంత నష్టం చేస్తుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.