నిజాం సెక్యులర్, మహాత్మాగాంధీయే చెప్పారు: కెసిఆర్
నిజామాబాద్: మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. బిజెపితో పొత్తు ఉండదనే విషయాన్ని ఆయన ఆ విధంగా అన్నారు. నిజాం ఓ సెక్యులర్ రాజు అని, 1920లో మహాత్మాగాంధీ చెప్పారని ఆయన అన్నారు నిజాం పాలనలో అందరూ మత సామరస్యంతో మెలిగారని అన్నారు.
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై కెసిఆర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ పునర్నిర్మాణం ఏమిటి? నాగసాకి, హిరోషిమాలోలా ఇక్కడేమైనా బాంబులు పడి విధ్వంసం జరిగిందా? అలాంటప్పుడు కెసిఆర్ పునర్నిర్మాణం అనడంలో అర్థం ఏముందని పొన్నాల చేసిన వ్యాఖ్యలపై కెసిఆర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. అది నిజమేనని, అరవై ఏళ్ల సీమాంద్రుల పాలనలో తన తెలంగాణ నాగసాకికన్నా ఎక్కువ విధ్వంసానికి గురైందని, తెలంగాణను పునర్నిర్మించాల్సిందేనని ఆయన అన్నారు. కాదంటే బహిరంగ చర్చకు రావాలని ఆయన పొన్నాలకు సవాల్ విసిరారు.
ఎక్కడ ఎంత విధ్వంసం జరిగిందో తాను చూపిస్తానని, ఎక్కడ విధ్వంసం జరగలేదో పొన్నాల చూపిస్తారా అని సూటిగా ప్రశ్నించారు. నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల సమీపంలోగల మైదానంలో మంగళవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పొన్నాల తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. సీమాంధ్ర పాలకుల పల్లకీలను మోసి, నెంబర్ 2గా పని చేసిన చరిత్ర పొన్నాలదని, అంతకంటే ఎక్కువగా ఆలోచించే శక్తి పొన్నాలకు లేదని, కెసిఆర్ అజ్ఞానానికి జాలిపడుతున్నానని ఆయన అన్నారు.
నీటి కేటాయింపులు లేకుండా తెలంగాణ నీళ్లను తరలించుకుపోయేందుకు ఆనంతపురం జిల్లాకు చెందిన మంత్రి రఘువీరారెడ్డి గాలేరు, నగరి అక్రమ ప్రాజెక్ట్ కోసం పాదయాత్ర చేస్తే మహబూబ్నగర్ మంత్రి డికె అరుణ మంగళహారతులు పట్టి స్వాగతం పలకగా, పొన్నాల జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి దద్దమ్మలు తెలంగాణ ఉద్యోగుల సమస్యలను, నీటి సమస్యలను పరిష్కరిస్తారా?'' అని కెసిఆర్ అడిగారు.
ముళ్ల చెట్లకు నీళ్లు పోస్తే పండ్లు రావనేది గుర్తుపెట్టుకోవాలని సూచించారు. తెలంగాణ కోసం ఏళ్ల తరబడి పోరాటం చేసిన తమ పార్టీని గెలిపిస్తేనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమని కెసిఆర్ స్పష్టం చేశారు.