ఇంకా కిరికిరి వద్దు, సచివాలయంలో కల్తీ వద్దు: కెసిఆర్
హైదరాబాద్: ఆంధ్రావాళ్లు ఉద్యోగుల పంపకాల్లో కిరికిరి పెడితే తాము ఊరుకునే ప్రసక్తి లేదని, తమతో కయ్యాలు పెట్టుకోవద్దని, మీరు కయ్యానికి కాలు దువ్వితే తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అన్నారు. తెలంగాణ ఉద్యోగుల సమావేశంలో కెసిఆర్ మాట్లాడారు.
తెలంగాణ మనం అనుకున్నంత గొప్పగా రాలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో 1969లో అయినా, ఇప్పుడైనా ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమన్నారు. సకల జనుల సమ్మె అత్యద్భుతమన్నారు. ఆలిండియా సర్వీసుల ఉద్యోగుల పంపిణీలో ఆందోళన వద్దన్నారు. జూన్ 2 వరకు ఆలిండియా సర్వీసుల ఉద్యోగుల పంపీణి జరగదన్నారు. డివోపి ప్రకారమే విభజన ఉంటుందన్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని నడిపేందుకే తాత్కాలికంగా ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తున్నట్లు సిఎస్ చెప్పారన్నారు.

ఉద్యోగుల విభజనలో ఆంధ్రా వాళ్లు కిరికిరి పెట్టుకోవద్దన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు రాష్ట్రాలు వేరైనా దేశం ఒఖ్కటే అన్నారు. ఆలంపూర్ నుండి భద్రాచలం వరకు ఇరు రాష్ట్రాల మధ్య పొలిమేర ఉందన్నారు. మీరు సంయమనం పాటించాలని, కయ్యం పెట్టుకోవద్దన్నారు. అలాంటి ప్రయత్నాలు చేయవద్దని కోరారు.
కయ్యానికి కాలు దువ్వొద్దని ఆంధ్రావారికి చెబుతున్నానని చెప్పారు. కిరికిరి పెడితే కోట్లాటకు తాము సిద్ధమన్నారు. మీరు బాగుండాలి.. మేం బాగుండాలన్నారు. తెరాస ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీగా ఉంటుందన్నారు. ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రాలోనే, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలోనే ఉండాలన్నారు. తెలంగాణ నుండి భారత్ నేర్చుకునేలా తెరాస పాలన ఉంటుందన్నారు. భారత్కు మనం సంస్కారం చూపించుదామని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వంలో సమ్మెలు, ధర్నాలు ఏమీ వద్దన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండరని, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం నడపాలంటే ఉద్యోగులే కీలకమన్నారు. తెలంగాణ వస్తే మంచి జరుగుతుందని తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, మనమందరం కష్టపడి వారి కోరికలను నెరవేర్చే ప్రయత్నాలు చేద్దామన్నారు.
మహిళలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి తాను, తన మంత్రి వర్గం కూడా బాగా కష్టపడుతుందని చెప్పారు. రాష్ట్రాలు విడిపోయాక కూడా మా స్వేచ్ఛ మాకు ఉండనీయాలని సీమాంధ్ర వారికి హితవు పలికారు. విద్యుత్ రంగాన్ని ప్రయివేటు సంస్థలకు అప్పగించబోమన్నారు. ఉద్యోగులతో తరుచూ భేటీ అవుతుంటానని చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఆలోచిస్తామన్నారు.












Click it and Unblock the Notifications