మంత్రివర్గ సమావేశానికి కెఈ గైర్హాజర్: జగన్ది బూటకపు యాత్ర అని రావెల
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన రాజమండ్రిలో బుధవారం ప్రారంభమైన మంత్రివర్గ సమావేశానికి డిప్యూటీ ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి గైర్హాజరయ్యారు. అయితే, కాలికి సర్జరీ జరగడం వల్లనే ఆయన సమావేశానికి హాజరు కాలేదని సమాచారం. ఈ విషయాన్ని కెఈ కూడా ధ్రువీకరించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిది బూటకపు యాత్ర అని మంత్రి రావెల కిశోర్ బాబు వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తలపెట్టిన పర్యటనపై కూడా ఆయన బుధవారంనాడు స్పందించారు. రాష్ట్ర విభజనకు కారణమైన రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించడానికి అనర్హుడని ఆయన అన్నారు. కాంగ్రెసు హయాంలో మరణించిన రైతుల కుటుంబాలను రాహుల్ గాంధీ ఎందుకు పరామర్శించడం లేదని అడిగారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. రైతులకు 693 కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం వారం రోజులుగా రాజమండ్రిలోనే మకాం వేసిన చంద్రబాబు ముఖ్యమైన కార్యక్రమాలను కూడా ఇక్కడి నుంచే నిర్వహిస్తున్నారు.
రాజమండ్రి తొక్కిసలాటలో మరణించినవారికి మంత్రి వర్గ సమావశంలో సంతాపం ప్రకటించారు. ఎపి రాజధాని మాస్టర్ ప్లాన్, ఆగస్టు 15వ తేదీ వేడుకలు, భూసేకరణ చట్టంపై, గృహనిర్మాణ పథకంపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.
అదే విధంగా మైనింగ్ పాలసీ, రాజమండ్రి తొక్కిసలాట ఘటన, అసెంబ్లీ వర్షాకాలం సమావేశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గోదావరి పుష్కర ఏర్పాట్లపై కూడా సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.