ఆధిపత్యం కోసమే: జగన్పై కెఈ, జగ్గారెడ్డిపై హరీశ్ ఫైర్
హైదరాబాద్/చిత్తూరు: వైయస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఉపముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శాసనసభా సంప్రదాయాలను జగన్మోహన్ రెడ్డి ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.
చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో కెఈ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ.. ఆధిపత్యం కోసమే జగన్మోహన్ రెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారని ధ్వజమెత్తారు. రాజధానిపై నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక తమకు ఇంకా అందలేదని చెప్పారు. జిల్లాకో స్మార్ట్ సిటీని నిర్మించిన తర్వాతనే రాజధానిపై ఆలోచిస్తామని చెప్పారు.
జగ్గారెడ్డికి గుణపాఠం చెబుతారు: హరీశ్
హైదరాబాద్: మెదక్ ఎంపి స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్న జగ్గారెడ్డిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెదక్ లోకసభ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గారెడ్డికి ప్రజలు మరోసారి గుణపాఠం చెబుతారని హరీశ్ రావు అన్నారు.
ఇక కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనే ప్రజలకేమి చేయలేదని హరీశ్ రావు విమర్శించారు. గ్రామం నుంచి రాష్ట్రం వరకు ప్రజలంతా తమ వెంటే ఉన్నారని అన్నారు.