రాయలసీమ పౌరుషం చూపిస్తాం: కెసిఆర్కు కెఈ హెచ్చరిక
కర్నూలు: తెలంగాణ ప్రాంతంలో పాలమూరు ప్రాజెక్టును అక్రమంగా నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూనుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేని ప్రాజెక్టును ఎలా నిర్మిస్తావని అడిగితే ప్రాజెక్టు నిర్మించి తమ తడాఖా చూపుతామని ముఖ్యమంత్రి కెసిఆర్ బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.
కెసిఆర్ బెదిరింపులకు తాము బెదరమని, రాయలసీమ పౌరుషమేంటో చూపిస్తామని కెఈ కృష్ణమూర్తి హెచ్చరించారు. కర్నూలు జిల్లా డోన్లో శుక్రవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సిఎం కెసిఆర్పై నిప్పులు చెరిగారు.
రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకే పట్టిసీమ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమేనన్నారు. తెలంగాణలో ఆర్డీఎస్, సుంకేశులకు మాత్రమే అనుమతులున్నాయని, మిగతా ప్రాజెక్టులకు లేవని కృష్ణా ట్రిబునల్ తీర్పు నిచ్చిందని వివరించారు.
శాంతిభద్రతలను కాపాడాలని, సెక్షన్ 8 అమలు చేయాలని ఎన్నోసార్లు గవర్నర్కు విన్నవించినా పెడచెవిన పెడుతున్నారని కెయి ఆరోపించారు.