తెలియకుండా జగన్ వ్యాఖ్యలు, చెవిరెడ్డి అరెస్టుతో మాకేం సబంధం: కెఈ
నెల్లూరు: వాస్తవాలు తెలుసుకోకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్టుతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన శుక్రవారం ఇక్కడ మీడియాతో అన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమంలో రైలు బోగీలపై దాడి కేసుకు సంబంధించి చెవిరెడ్డిపై రైల్వే అధికారులు కేసు పెట్టారని చెబుతూ ఆంధ్ర ప్రభుత్వానికి ఏమిటి సంబంధమని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకే రైల్వే పోలీసులు చెవిరెడ్డిని అరెస్టు చేసి, కోర్టు ఆదేశాల మేరకు జైలుకు పంపారని తెలిపారు.
జగన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈకృష్ణమూర్తి సూచించారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వంపై జగన్ విమర్శలు చేయడం మానుకోవాలని కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఏ పార్టీలో లేని విధంగా టిడిపికి 51లక్షలమంది కార్యకర్తలున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కేఈ కృష్ణమూర్తి అన్నారు.
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని కొనియాడారు. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు సహనం కోల్పోతున్నారని, ప్రభుత్వంపై జగన్ చేస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు. తప్పు చేస్తే చట్టం తనపని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. మీ ఇంటికి మీ భూమితో రైతు సమస్యలు 90 శాతం పరిష్కారమయ్యాయని ఆయన తెలిపారు.