బాబుకు మరో బేజారు: గద్దెపై యలమంచిలి ఫైర్, నానికి మందలింపు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బెజవాడ పార్టీ వ్యవహారం మరో తలనొప్పిని తెచ్చి పెట్టింది. శానససభ్యుడు గద్దె రామ్మోహన్పై మాజీ శాసనసభ్యుడు యలమంచిలి రవి తీవ్రంగా ధ్వజమెత్తారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తీరుపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని బహిరంగంగా విమర్శలు చేసిన మర్నాడే గద్దె, యలమంచిలి వివాదం రచ్చకెక్కడం చంద్రబాబుకు సమస్యగానే మారిందని చెప్పాలి.
పటమట రైతు బజారులో స్టాళ్లను రామ్మోహన్ టోకున అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఒక్కో స్టాల్కు 2 లక్షల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి కొంత మంది నేతలు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. గద్దె వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోకపోతే పార్టీ అధినేత చంద్రబాబు వద్దనే పంచాయతీ పెడుతానని ఆయన హెచ్చరించారు.
గత ఆరు నెలలుగా గద్దె రామ్మోహన్ తనను అవమానించే పద్ధతిలో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. గద్దె రామ్మోహన్తో పోరాటం చేసే స్థాయికి తాను దిగజారలేదని ఆయన అన్నారు. ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధిని పక్కన పెట్టి రైతుల బజారులో ఫ్లెక్సీలను వివాదం చేస్తారా అని ఆయన అడిగారు. ఓ సిఐని తనపైకి పంపుతారా, అది సిగ్గుమాలిన చర్య అని ఆయన అన్నారు. తన భవిష్యత్తు కార్యాచరణపై చంద్రబాబుతో చర్చిస్తానని యలమంచిలి రవి చెప్పారు.
ఇదిలావుంటే, దేవినేని ఉమామహేశ్వర రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేశినేని నాని శనివారంనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. ఆయన చంద్రబాబును కలవడానికి సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు నిరీక్షించారు. ఈలోగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రి నారాయణ చంద్రబాబును కలిశారు. చివరకు కేశినేని నానిని చంద్రబాబు తన కారులో తన నివాసానికి తీసుకుని వెళ్లారు. అక్కడ కేశినేని నానితో చంద్రబాబు మాట్లాడారు. తాను చంద్రబాబు ఆదేశాలను పాటిస్తానని కేశినేని నాని భేటీ తర్వాత అన్నారు. మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం లేదని చంద్రబాబుతో చెప్పానని, ఆ విషయం పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని ఆయన అన్నారు.
బహిరంగంగా వ్యాఖ్యలు చేసినందుకు తనను చంద్రబాబు మందలించినట్లు ఆయన తెలిపారు. బహిరంగంగా వ్యాఖ్యలు చేయవద్దని తనకు సూచించినట్లు ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయనని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. అధికారుల పనితీరు మారాలనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని ఆయన చెప్పారు.