కేశినేని ప్రశ్న, ఇబ్బందిపడ్డ కేంద్రమంత్రి: మోడీ! బాబు కష్టం చూడు: శివప్రసాద్
న్యూఢిల్లీ: సోమవారం నాడు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (రెండో విడత) ప్రారంభమయ్యాయి. లోకసభ, రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో ఉత్తరాఖండ్ సంక్షోభం పైన కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపిస్తూ పోడియం వద్దకు దూసుకు వచ్చింది. సభాపతి పదేపదే వారిని వారించారు.
కాగా, లోకసభలో ప్రశ్నోత్తరాలు జరిగాయి. విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నాని ప్రశ్నోత్తరాల సమయంలో అందర్నీ ఆకట్టుకున్నారు. వంట గ్యాస్ (ఎల్పీజీ) సరఫరాకు సంబంధించి మోడీ ప్రభుత్వం ఇటీవల చేసిన పలు మార్పులపై కేశినేని నాని ప్రశ్న వేశారు.
దీనిపై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం చెప్పేందుకు కాస్తంత ఇబ్బంది పడ్డారు. ఇక కేశినేని నాని వేసిన ప్రశ్నపై సభలోని ఇతర పార్టీల సభ్యులు కూడా అనుబంధ ప్రశ్నలు సంధించారు.
తొలిసారి ఎంపీగా సభకు వచ్చినా ప్రశ్న సంధించడంలోనే కాక, సమాధానాన్ని రాబట్టడంలోనూ కేశినేని సత్తా చాటారు. ఏమాత్రం తొట్రుపాటు లేకుండా కేశినేని నాని ప్రశ్నను సంధించి సభ దృష్టిని ఆకట్టుకున్నారు.
చిత్రమైన వేషధారణలో వచ్చిన ఎంపీ శివప్రసాద్
చిత్తూరు టిడిపి పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ చిత్రమైన వేషధారణలో పార్లమెంటుకు వచ్చారు. శివప్రసాద్ కుచేలుడి వేషధారణలో కనిపించారు. ఆయన పార్లమెంటు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు.
విభజన నేపథ్యంలో ఏపీ ఎన్నో ఇబ్బందుల్లో ఉందని, తాము 'నమో మోడీ' అంటూ ప్రధానిని నమ్ముకున్నామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక నిధులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా ప్రజల కోరిక అని దానిని నెరవేర్చాలన్నారు.
మోడీ సార్.. మోడీ గారు.. ఏపీని ఆదుకోవాలని కోరేందుకు ఢిల్లీకి తిరిగి తిరిగి మా కాళ్లు అరిగిపోతున్నాయని, ఎంతమందిని అడుక్కోవాలని ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఢిల్లీకి రావాల్నారు. ఏపీని ఢిల్లీ కంటే గొప్పగా చేస్తామని మీరే హామీ ఇచ్చారని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
మేం కూడా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నామని ఎంపీ శివప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శివప్రసాద్ ఏపీ బాధలను పాటల రూపంలో వినిపించారు.
'ఇంతింతి ఇంతింత ఇకిలించినట్లుంటే ఏపీ లోటు ఎప్పుడు కూడునో... ఆంధ్ర రాత ఎప్పుడు మారునో, బాబు కష్టం చూస్తే బాధగా ఉంది.. వెంకయ్య ఏమయ్యేనో' అంటూ పాట పాడారు. ఓం నమో మోడీ గారు అంటూ ఆయన ఏపీని ఆదుకోవాలని కోరారు.