పోయేదేం లేదు, పార్లమెంటును స్తంభింపజేస్తాం: హోదాపై కేశినేని నాని
విజయవాడ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాము పార్లమెంటును స్తంభింపజేస్తామని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని అన్నారు. రాష్ట్రానికి మేలు జరుగతుందనే తాము మోడీ మంత్రివర్గంలో చేరామని, రెండు మంత్రిపదవులు పోయినంత మాత్రాన తమకు జరిగే నష్టమేమీ లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తమ పార్టీ ఎంపీలంతా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రేపటి సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని చెప్పారు. మిత్రపక్షమైనంత మాత్రాన ఎపికి ప్రత్యేకంగా సాయం చేయాలని ఏమీ లేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అనడం సరి కాదని ఆయన అన్నారు. వైసిపి కుమ్మక్కు పార్టీ అని, జగన్ ఆందోళనలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేశినేని నాని అన్నారు.
ఏపీ హక్కులను పరిరక్షించడంలో కేంద్రం విఫలమైందని తెలుగుదేశం పార్టీ శానససభ్యుడదు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ప్రత్యేకహోదా హామీని బీజేపీ పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. హోదా విషయంలో ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ప్రజాభిప్రాయం మేరకే టీడీపీ నడుచుకుంటుందని గోరంట్ల తెలిపారు.

కాంగ్రెసు, బిజెపి నాటకాలు
గతంలో పార్లమెంట్లో నాటకమాడిన కాంగ్రెస్, బీజేపీలు అదే ఆటను పునరావృతం చేశాయని తెలుగుదేశం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు ప్రత్యేకంగా ఏం చేశారని ప్రశ్నించారు.
ఏపీకి అన్ని రాష్ట్రాలలాగే సాయం చేస్తామన్న అరుణ్ జైట్లీ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. ప్రత్యేక హోదాపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వైసీపీ కేంద్రంపై పోరాడాలి తప్ప టీడీపీపై కాదన్నారు. ప్రత్యేక హోదా హామీ అమలు చేయాల్సింది కేంద్రమే అని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.
శివాజీ సీరియల్లో నటించుకోవాలని హితవు
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టిడిపి రాజీ పడదని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. కేంద్రం తమ మంచి తనాన్ని అసమర్దతగా భావిస్తే సహించేది లేదని చెప్పారు. శివాజీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. వెళ్లి టి.వీ సీరియళ్లలో నటించుకోవాలని హితవుపలికారు. రాష్ట్ర అంశాలపై చర్చకు ముందుకు రావాలని రాజేంద్రప్రసాద్ సవాల్ విసిరారు.
మొదటి ముద్దాయి చంద్రబాబు
హైదరాబాద్ : రాష్ట్ర విభజనలో మొదటి ముద్దాయి చంద్రబాబే అని మాజీ మంత్రి శైలజానాథ్ ఆరోపించారు. ఇంకా ఎందుకు కాంగ్రెస్ను విమర్శిస్తారన్నారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాడాలని సూచించారు.
టీడీపీ కేంద్ర మంత్రులు మోడీని ఎందుకు నిలదీయడం లేదని శైలజానాథ్ ప్రశ్నించారు. మోదీ, చంద్రబాబు, వెంకయ్యను ఏపీ ప్రజలు ద్రోహులుగా చూస్తున్నారని మరో నేత కొండ్రు మురళి అన్నారు. బీజేపీ, టీడీపీ నేతలు ప్రత్యేక హోదా విషయంలో ద్రోహులుగా మిగలొద్దని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications