"రెక్కీలు నిర్వహించి దొంగతనం చేస్తోన్న వైసీపీ నేతలు"
విజయవాడ : ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు అధికార టీడీపీ ఎంపీ కేశినేని నాని. గడప గడపకూ వైసీపీ అంటూ జనంలోకి వెళ్తున్న ప్రతిపక్ష పార్టీ కార్యాచరణను ఎద్దేవా చేశారు నాని. గడప గడపకూ వెళ్లి వైసీపీ నేతలు చేస్తున్నది ప్రజాభిప్రాయ సేకరణ కాదని, రెక్కీలు నిర్వహిస్తున్నారని కేశినేని నాని ఆరోపించారు.
సమస్యలు తెలుసుకుంటామన్న సాకుతో ఉదయం పూట రెక్కీలు నిర్వహిస్తున్న వైసీపీ నేతలు.. రాత్రి పూట దొంగతనాలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర విమర్శ చేశారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం కమ్మవారిపాలెంలో నేటి ఉదయం ప్రారంభమైన జనచైతన్యయాత్రలో కేశినేని నాని ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో జరగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే.. ప్రజల్లో లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని నాని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని, వైసీపీ నేతల ఆగడాలకు ప్రజలు బ్రేక్ వేయాలని ఈ సందర్బంగా స్థానిక ప్రజలకు సూచించారాయన.