జగన్ చెప్పిందే వినాలా, శక్తి లేదా?: దూరమైన కీ లీడర్స్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించినప్పటి నుండి పార్టీలో ముఖ్యులుగా భావించే పలువురు వరుసగా ఆయన పైన దుమ్మెత్తి పోస్తూ పార్టీని వీడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు ఆయనకు దూరమయ్యారు. ఆయనకు ఆప్యాయులుగా భావించే కొండా సురేఖ, సబ్బం హరి వంటి నేతలు కూడా పార్టీని విడిచి పెట్టారు.
వైయస్ రాజశేఖర రెడ్డికి నీడలా ఉన్న సూరీడు, వైయస్ ఆత్మలా భావించే కెవిపి రామచంద్ర రావులు జగన్ వెంట నడవలేదు. వైయస్ను బాగా అభిమానించే ఆనం సోదరుల వంటి వారు కూడా ఆయన వెంట నడవలేదు. నిన్న... కొండా సురేఖ, రాజశేఖర్, జీవిత, సబ్బం హరి, మారెప్ప, నేడు దాడి వీరభధ్ర రావు.. ఇలా ఎవరు పార్టీని వీడినా జగన్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయనకు అహంకారం ఎక్కువని, అతి విశ్వాసమని, తాను చెప్పిందే వేదమన్నట్లుగా ఉంటారని విమర్శలు గుప్పిస్తూ పార్టీని వీడుతున్నారు.
తాజాగా ఎన్నికల్లో పార్టీ పరాజయం అనంతరం దాడి ఆయనను ఏకిపారేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఓటమికి జగనే కారణమని, ఆయనకు పార్టీ నడిపే శక్తి లేదన్నారు. మేకపాటి వంటి వారు మాత్రం మొదటి నుండి జగన్ వెంటే నడుస్తున్నారు. కాగా, వరుసగా కీలక నేతలు పార్టీని వీడుతూ.. జగన్ అహంకారి అని, ఆయన చెప్పేందే వినాలంటూ మండిపడుతున్నారు.
కొండా సురేఖ
వైయస్ జగన్ కోసం తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. వైయస్ పైన అభిమానంతో ఆమె మొదటి నుండి జగన్ వెంటే ఉన్నారు. జగన్ కోసం కొండా సురేఖ చేసిన పదవుల త్యాగం ఎవరు చేయలేరని ఆరోపిస్తుంటారు. అలాంటి సురేఖ ఆ తర్వాత జగన్ పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె తెరాసలో ఉన్నారు. ఎన్నికలకు ముందు తెరాసలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
రాజశేఖర్, జీవిత
రాజశేఖర్, జీవితలు తొలుత జగన్ వెంట నడిచారు. ఆ తర్వాత వారు జగన్కు దూరమయ్యారు. జగన్కు తననే అందరు చూడాలని, ఇతరులు తన కంటే తక్కువగా కనిపించాలని భావిస్తారని వారు ఆరోపిస్తూ పార్టీని వీడారు. ప్రస్తుతం జీవిత బిజెపిలో ఉన్నారు.
సబ్బం హరి
సార్వత్రిక ఎన్నికల ముందు వరకు సబ్బం హరి కాంగ్రెసు పార్టీ ఎంపీగా ఉన్నప్పటికీ జగన్కు అండగా నిలబడ్డారు. ఎన్నికలకు ముందు జగన్కు అహంకారం ఎక్కువ అని ఆరోపిస్తూ నిప్పులు చెరిగారు.
దాడి వీరభద్ర రావు
సార్వత్రిక ఎన్నికలకు ముందు దాడి వీరభద్ర రావు టిడిపి నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయన ఈరోజు (బుధవారం) పార్టీకి రాజీనామా చేశారు. జగన్కు అహంకారం ఎక్కువ అని, అతి విశ్వాసమని, తల్లిని, చెల్లినే నమ్మరని సంచలన వ్యాఖ్యలు చేసి బయటకు వచ్చారు.
కెవిపి రామచంద్ర రావు
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి ఆత్మగా పేరు గాంచిన కెవిపి రామచంద్ర రావు ఆయన తనయుడు జగన్ వెంట నడవలేదు. కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతున్నారు.
సూరీడు
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి నీడలా ఉన్న సూరీడు ఆ తర్వాత జగన్ వెంట నడవలేదు. జగన్ వైఖరి తెలిసినందువల్లే ఆయన దూరంగా ఉన్నారనే వ్యాఖ్యలు అప్పట్లో వినిపించాయి.
ఆనం సోదరులు
వైయస్ రాజశేఖర రెడ్డి మృతి అనంతరం ఆయనకు సన్నిహితులుగా ఉన్న పలువురు వైయస్ జగన్ వెంట నడవలేదు. ఆనం సోదరులు తదితరులు ఎందరో వైయస్కు ఆప్తులుగా ఉండేవారు. కానీ వారు జగన్కు ఎప్పుడు దూరంగానే ఉన్నారు.
షర్మిల
వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నప్పుడు షర్మిల పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్రంగా కృషి చేశారు. పాదయాత్ర కూడా చేశారు. అలాంటి షర్మిల కూడా జగన్ పైన అసంతృప్తితో ఉన్నప్పుడు పలు సందర్భాల్లో వాదనలు వినిపించాయి. షర్మిలనే కాకుండా.. బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నట్లుగా అప్పట్లో వాదనలు వినిపించాయి.
శోభా నాగిరెడ్డి
శోభా నాగిరెడ్డి కూడా గతంలో అసంతృప్తికి లోనైనట్లుగా ప్రచారం జరిగింది. ఇటీవల పార్టీ అధికారంలోకి రాకపోవడంతో కర్నూలు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారనే ప్రచారం సాగింది. ఆ లిస్టులో భూమా నాగిరెడ్డి పేరు వినిపించినప్పటికీ... ఆయన దానిని తీవ్రంగా ఖండించారు.
రోజా
ప్రముఖ సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా పలుమార్లు అసంతృప్తికి లోనయ్యారు. ఇటీవల ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడుతారని ప్రచారం సాగినా.. ఆమె దానిని ఖండించారు.