కియా రయ్..రయ్! వైఎస్ జగన్ చేతుల మీదుగా మొదటి కారు: 31న ఆవిష్కరణ!
అనంతపురం: ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న కియా కార్లు ఇక దేశీయ రోడ్లపైకి రయ్మంటూ దూసుకుని రాబోతున్నాయి. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఏర్పాటైన ఫ్యాక్టరీలో కియా కార్లు తుది రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఈ నెల 31వ తేదీన ఆ కార్ల మాస్ ప్రొడక్షన్ కార్యక్రమం ఏర్పాటు కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ వెల్లడించారు.
కథ మళ్లీ మొదటికొచ్చినట్టేనా? సభా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యంపై సుప్రీంకోర్టులో పిటీషన్
కియా మోటార్స్ సంస్థ ప్రతినిధి శుక్రవారం ఉదయం సత్యనారాయణను కలిశారు. మాస్ ప్రొడక్షన్ కార్యక్రమాన్ని ఈ నెల 31వ తేదీన నిర్వహించబోతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆయన కలెక్టర్కు అందజేశారు. ప్లాంట్ నుంచి ఉత్పత్తయిన మొట్టమొదటి కారును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఆవిష్కరించదలిచినట్లు చెప్పారు. ఫ్యాక్టరీ నిర్మాణంలో సహకరించిన జిల్లా పాలనా యంత్రాంగానికి కియా మోటార్స్ సంస్థ ప్రతినిధి కలెక్టర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. దీనికి సత్యనారాయణ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి హాజరవుతారని ఆయన సూచనప్రాయంగా తెలిపారు.
కరవు జిల్లా పేరున్న అనంతపురంలో కియా కార్ల తయారీ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎవరి హయాంలో బీజం పడిందనే అంశంపై కొద్దిరోజుల కిందటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కియా కార్ల తయారీ ఫ్యాక్టరీని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయాలని 2007లోనే అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమకు విజ్ఞప్తి చేశామని అంటూ కియా మోటార్స్ అధినేత వెల్లడించినట్లు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిండు సభలో ప్రకటించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరిగింది. కరవు జిల్లాకు తానే కియా కార్ల పరిశ్రమను తీసుకొచ్చానంటూ చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పుకొన్నారు. ఈ ఏడాది జనవరిలో ఓ కారును కూడా ఆవిష్కరించారు. అది ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలుసు. దిగుమతి చేసుకున్న కారును అనంతపురం ప్లాంట్లో ఉత్పత్తి చేసినట్లు చూపించారని, ఎన్నికల్లో లబ్ది పొందడానికే చంద్రబాబు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్రయోగించారని అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.