తెనాలిలో ముగ్గురు పిల్లల కిడ్నాపర్ అరెస్టు
గుంటూరు: గుంటూరు జిల్లాలోని తెనాలి రైల్వేస్టేషన్లో జరిగిన కిడ్నాప్ మిస్టరీని ఆర్పీఎఫ్ పోలీసులు చేధించారు. ముగ్గురు చిన్నారులతో తెనాలి రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇద్దరు బాలికలు ఓ బాలుడు ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ పార్కులో ఆడుకుంటుండగా కిడ్నాప్ చేసినట్లు కిడ్నాపర్ శ్రీనివాసరావు తెలిపారు.
వీరిని హైదరాబాద్లో అప్పగిస్తే ఓ వ్యక్తి రూ.10 లక్షలు ఇస్తానని చెప్పాడని అందుకే వీరిని కిడ్నాప్ చేసినట్లు శ్రీనివాసరావు చెప్పాడు. వారిని హైదరాబాదుకు తరలించడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. చీరాల పరిధిలోని ఇంకొల్లుకు చెందిన తప్పిట శ్రీను అనే వ్యక్తి చీరాల రైల్వే సమీపంలోని పార్కులో ఆడుకుంటున్న తిరువీధుల గిరీష్, లహరి, ఆర్షియాలను ఆదివారం కిడ్నాప్ చేశాడు.
వారిని హైదరాబాదు తరలించేందుకు తెనాలి వచ్చాడు. ప్లాట్ఫారంపై అనుమానాస్పదంగా సంచరిస్తున్న అతన్ని పట్టుకుని రైల్వే పోలీసులు విచారించడంతో అసలు విషయం బయటపడింది. కిడ్నాపర్ను అరెస్టు చేసి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు సోమవారం ఉదయం తెనాలి ఆర్పిఎప్ పోలీసు స్టేషన్కు చేరుకున్నారు.
విజయనగరం జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మరణించారు.గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేటలో కుటుంబకలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సాలూరు మండలం దండిగాంలో రామారావు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించారు.