చంపినా తప్పులేదు: కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ఆగ్రహం
హైదరాబాద్: అత్యాచారాలకు పాల్పడే దుండగులను చంపినా నేరం కాదని కేంద్రమంత్రి కిల్లి కృపారాణి సోమవారం అన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ వివిధ అంశాలపై మహిళలకు అవగాహనను కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నిర్వహిస్తున్న పక్షోత్సవాల ప్రారంభ సభ సోమవారం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమైంది. ఇవి ఈ నెల 25 నుంచి డిసెంబర్ 10 వరకు జరుగుతుంది. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిల్లి కృపారాణి మాట్లాడారు.
విద్యావంతులైన మహిళలు అన్యాయాన్ని ఎదురించడం అలవాటు చేసుకోవాలన్నారు. న్యాయ, పోలీస్, రాజకీయ వ్యవస్థలు మహిళలపై చిన్నచూపు చూస్తున్నాయని, 2011లో మహిళలపై దాడులు జరిగినట్లు 24వేల కేసులు నమోదైతే అందులో పదివేల కేసులపై విచారణ జరిగిందని, వీటిలో కేవలం 4వేల మందికి మాత్రమే శిక్ష పడిందని ఆమె తెలిపారు. మహిళలపై దాడులను అరికట్టడానికి మరికొంత మందిని మహిళా పోలీసుల్ని, మహిళా పోలీస్ స్టేసన్లను ఏర్పాటు చేయాలని ఆమె అన్నారు.

మహిళలందరూ అక్షరాస్యులైతేనే వారిపై జరుగుతున్న దాడులను అరికట్టవచ్చనీ, సమాజంలో మహిళను కేవలం ఒక శృంగార వస్తువుగా చూడవద్దని, సృష్టికి ప్రాణం పోసే మహిళపై దాడులు చేయడం సిగ్గుచేటని, చిన్నా పెద్ద అనే తేడాలేకుండా మహిళలందరిపై జరుగుతున్న దాడుల వల్ల మానవత్వానికి అర్ధం లేకుండాపోతోందని కృపారాణి అవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు ఎన్నో చట్టాలున్నప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదని, పెరిగిపోయిన ఇంటర్నెట్ వాడకం, మద్యం, ప్రైవేటు రవాణా వ్యవస్థల వల్ల ఈ దాడులు మరింత ఎక్కువయ్యాయన్నారు.
మహిళలపై జరుగుతున్న దాడులను ఆపడం కేవలం ప్రభుత్వం వల్లనే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేయాలని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మహిళలను ఆదుకోవడానికి దేశవ్యాప్తంగా 181 అనే హెల్ప్లైన్ నెంబర్ను త్వరలోనే ఏర్పాటు చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications