బయటకొస్తూ కిరణ్ నినాదాలు: ఏకిపారేసిన దామోదర
హైదరాబాద్: శాసన సభను సభాపతి నాదెండ్ల మనోహర్ నిరవధికంగా వాయిదా వేసిన అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ నుండి బయటకు వస్తూ జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ ముగిసినట్లు సభాపతి నాదెండ్ల మనోహర్ ప్రకటించి అసెంబ్లీని వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో బయటకు వస్తూ కిరణ్ సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రజాభీష్టం నెగ్గిందన్నారు.
బిల్లు పైన ఓటింగ్ జరపకపోయినప్పటికీ.. కిరణ్ ఇచ్చిన నోటీసు పైన స్పీకర్ మూజువాణి ఓటు ద్వారా అభిప్రాయం తీసుకున్నారు. కిరణ్ నోటీసు నెగ్గింది. శాసన సభ తెలంగాణ ముసాయిదా బిల్లును తిరస్కరించింది. దానిని రాష్ట్రపతికి పంపించారు. తెలంగాణ ముసాయిదా బిల్లును పార్లమెంటుకు పంపించవద్దని కిరణ్ కోరారు.
చరిత్ర గుర్తిస్తుంది: పయ్యావుల
తెలంగాణ ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ కిరణ్ ఇచ్చిన నోటీసును తిరస్కరించడాన్ని చరిత్ర గుర్తిస్తుందని సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. తాము పార్టీలకతీతంగా తెలంగాణ ముసాయిదా బిల్లును ఓడించామన్నారు. ఈ తీర్మానాన్ని ఓడించడాన్ని చరిత్ర గుర్తిస్తుందని చెప్పారు. సభలో తాము సమైక్యవాణిని సమర్థవంతంగా వినిపించామన్నారు.
కిరణ్ పైన మండిపడ్డ డిప్యూటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గురువారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల కల త్వరలో సాకారం కాబోతుందన్నారు. కిరణ్ వద్ద బంతి లేదు.. బ్యాటు లేదని ఎద్దేవా చేశారు. మైదానం ఖాళీ అయిందని, కిరణ్కు మైలేజీ రాలేదన్నారు. ఇంతకాలం ముఖ్యమంత్రి స్వార్థం కోసమే డ్రామా ఆడారని దుయ్యబట్టారు.