దిగొచ్చిన కిరణ్: ఢిల్లీ ఇష్యూపై మహిళామంత్రులకు ఫోన్
దీనిపై కిరణ్ విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత మంత్రులు గీతా రెడ్డి, సునిత లక్ష్మా రెడ్డి, డికె అరుణ తదితరులకు కిరణ్ శుక్రవారం ఫోన్ చేశారు. ఫోన్ ద్వారా ఢిల్లీలో జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
కాగా, దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి దీక్ష కోసం వెళ్తుండగా అడ్డుకునే ప్రయత్నం చేసిన మహిళా తెలంగాణ మంత్రులను పోలీసులు ఈడ్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అప్పుడే మంత్రులు గీతా రెడ్డి, డికె అరుణ, సునిత లక్ష్మా రెడ్డి నిప్పులు చెరిగారు. మహిళా మంత్రులం అని కూడా చూడకుండా తమను పోలీసులు ఈడ్చి వేస్తుంటే ముఖ్యమంత్రి రాక్షసానందం పొందుతున్నారని వారు ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రిది అహంకారపూరిత వైఖరి అని, నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. సిఎం తీర్మానంలో తాము భాగస్వామ్యులం కాదల్చుకోలేదన్నారు. మహిళా మంత్రులను కూడా ఈడ్చి వేస్తుంటే ఆనందం పొందుతున్నారా అని ప్రశ్నించారు. ఈ మౌన దీక్ష ఎందుకు చేస్తున్నారో కిరణ్ చెప్పడం లేదన్నారు. కిరణ్ దీక్ష చేస్తే తెలంగాణ ఆగిపోతుందని తాము భావించడం లేదని కానీ అది సరికాదని చెబుతున్నామన్నారు. కిరణ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మహిళా మంత్రులైన తాము అడ్డుకుంటుంటే కిరణ్ బస్సు దిగి ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించే ప్రయత్నం ఎందుకు చేయలేదన్నారు. సీమాంధ్ర ప్రజల పైన ఇన్నాళ్లు లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకు వచ్చిందా అన్నారు. ఆయన సీమాంధ్ర సిఎంగా వ్యహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కిరణ్ ఇక డ్రామాలు బందు చేయాలన్నారు. సీమాంధ్ర ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని హితవు పలికారు.