చట్ట విరుద్ధం, కెసిఆర్ ఎవరు: కిరణ్, చిరుకి ఏం తెలుసని
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ చట్ట విరుద్ధంగా జరుగుతోందని, దానిని సరిదిద్దాలని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విభజన నేపథ్యంలో ఉద్యోగులకు ఖచ్చితంగా ఆప్షన్లు ఉంటాయని ఆయన అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్ట ప్రకారమే నిర్ణయాలు జరుగుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని కిరణ్ ఆరోపించారు.
సీమాంధ్ర ఉద్యోగులకు అండగా ఉంటామని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. కెసిఆర్కు చట్టాల గురించి అవగాహన లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆపడానికి కెసిఆర్ ఎవరని ప్రశ్నించారు. ఉద్యోగులు వెళ్లిపోవాలని కెసిఆర్ చెప్పడం అర్థరహితమని కిరణ్ అన్నారు. ఆయన నోటీ నుంచి ఎప్పుడూ నిజం రాదని తెలిపారు. పోలీవరం ప్రాజెక్టు డిజైనింగ్కు ప్రత్యామ్నాయం లేదని అన్నారు.
దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు మిగులు జలాలు వాడుకునే హక్కు ఉందని కిరణ్ అన్నారు. ఎగువ తెలంగాణకు మిగులు జలాలు దక్కవని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇస్తుందని, ఇది 16వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టని తెలిపారు. మిగులు జలాల విషయంలో తెలంగాణ నష్టపోతుందని తెలిపారు. అసత్యాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టొద్దని కెసిఆర్కు సూచించారు.
పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ. 4వేల కోట్లు ఖర్చయ్యాయని తెలిపారు. తెలంగాణపై కెసిఆర్ ఇంటర్వెల్ మాత్రమే అయ్యిందంటున్నారు.. తాము ఇప్పుడు రిస్టార్ట్ కావాలనుకుంటున్నామని తెలిపారు. తెలంగాణకు నీటి నిల్వకు అవకాశం లేదని కిరణ్ చెప్పారు. తెలంగాణకు నీటిని నిల్వ చేయడమే ప్రధాన సమస్య అని తెలిపారు. 1956కు ముందు భద్రాచలం తెలంగాణలో లేదని, పాలనాపరమైన సౌకర్యం కోసమే తెలంగాణలో కలిపారని చెప్పారు.
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కించపర్చినందుకే పార్టీని వీడినట్లు కిరణ్ తెలిపారు. తాను సిఎం పదవి వదిలేస్తానన్న తర్వాత ఆ పదవి కోసం అధిష్టానం చుట్టూ ఎందరు తిరిగారో అందరికితెలుసునని చెప్పారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా చట్టవిరుద్ధంగా ఏర్పడిన తొలి రాష్ట్రం తెలంగాణనేనని ఆయన అన్నారు. విభజన అనంతరం సమస్య మొదలవుతుందని చెప్పారు. కేంద్రమంత్రి చిరంజీవికి వాస్తవాలు తెలియవని తెలిపారు. మూడేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన చిరంజీవికి ఏం తెలుసునని కిరణ్ అన్నారు.
తెలిసీ తెలియకుండా మాట్లాడొద్దని, రాజకీయం అంటే డైలాగులు కాదని చిరంజీవికి చురకంటించారు. తనకు కాంగ్రెస్ పార్టీతో యాభై ఏళ్ల అనుబంధం ఉందని, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా పార్టీలోనే ఉన్నామని గుర్తు చేశారు. అవకాశవాదంతో తెలుగువారిని విడదీసి.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కించపర్చినందుకే కాంగ్రెస్ పార్టీని వీటినట్లు తెలిపారు. ఎంతగా లాబీయింగ్ చేసినా ఒక్క ముఖ్యమైన డిమాండ్ను నెరవేర్చలేకపోయారని కాంగ్రెస్ ఎంపీలపై మండిపడ్డారు.
టిఆర్ఎస్ కు 20 సీట్లు కూడా రావు: జగ్గారెడ్డి
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి వచ్చే ఎన్నికల్లో 20 అసెంబ్లీ స్థానాలు కూడా దక్కవని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణలో 90 శాతం సీట్లను కాంగ్రెస్ గెలుచుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. మెదక్ జిల్లా నుంచి టిఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు పోటీ చేసినా.. ఆ పార్టీ 2 ఎంపి సీట్లు, 9 అసెంబ్లీ స్థానాలకే పరిమితమవుతుందని అన్నారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటూ కెసిఆర్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.