పదవి వదులుకుంటా: కిరణ్ తాడోపేడో, డిగ్గీపై నిప్పులు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పైన శుక్రవారం మండిపడ్డారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిలా మాట్లాడుతున్నానని డిగ్గీ చెబుతున్నారని, ఆయన అలా అన్నప్పుడల్లా సమైక్యాంధ్ర కోసం మరింత గట్టిగా పోరాడాలనిపిస్తోందన్నారు. సమైక్య రాష్ట్రం కోసం తాను పదవి వదులుకునేందుకు సిద్ధమని, పదవులు వదులుకొని సమైక్యం కోసం కృషి చేస్తానన్నారు.
తాను సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిని కాబట్టే అలా మాట్లాడుతున్నానని చెప్పారు. తాను శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండనని, డిగ్గీ శాశ్వతంగా ఎపి ఇంఛార్జిగా ఉండరన్నారు. తాను తెలంగాణ ప్రజల సెంటిమెంట్కు ఏమాత్రం వ్యతిరేకం కాదన్నారు. విభజనతో ఆ ప్రాంతానికి కొంత లాభం జరిగినా అంతకంటే ఎక్కువ నష్టం జరుగుతుందన్నారు. తెలుగు ప్రజల భవిష్యత్తు కోసమే తాను సమైక్యాంధ్ర అంటున్నానని చెప్పారు.
తాను కాంగ్రెసు పార్టీలోనే ముఖ్యమంత్రిని అయ్యానని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్లనే ఈ స్థితిలో ఉన్నానని అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. సోనియా, కాంగ్రెసు లేకుంటే తాను ముఖ్యమంత్రిని కాకపోయి ఉండేవాణ్ణేమో అన్నారు. తాను పుట్టింది కాంగ్రెసు పార్టీలోనే అని రేపు కూడా కాంగ్రెసులోనే ఉంటానని చెప్పారు. తాను కాంగ్రెసు పార్టీని వదలనని పదవిని వదులుకుంటానని చెప్పారు.
తాను సమైక్యాంధ్రకు కట్టుబడింది సోనియా గాంధీ అంటే అభిమానం లేకనో కాంగ్రెసు పార్టీ ఇష్టం లేకనో కాదన్నారు. సమైక్యంగా ఉంటే ముందు తరాలకు మంచి జరుగుతుందని నమ్ముతున్నందు వల్లనే తాను సమైక్యమంటున్నట్లు చెప్పారు. విభజన సమస్య తన ఒక్కడి సమస్య కాదన్నారు. తాను ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానని అంతకన్నా పెద్ద పదవి ఏదీ లేదని అలాంటప్పుడు పదవుల కోసం పాకులాడుతానన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలా తాను పదవుల కోసం కోసం గడ్డి తినేవాడిని కాదన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని తెలుగు ప్రజల శ్రేయస్సు ముఖ్యమన్నారు. కాంగ్రెసు పార్టీని విడిచిపెడితే తనకు భవిష్యత్తు లేదని తనకు తెలుసునని చెప్పారు. కానీ విభజనతో వచ్చే నష్టం గురించి చెప్పాల్సిన బాధ్యత తన పైన ఉందన్నారు.
ఇది తన ముఖ్యమంత్రి పోస్టు సమస్య కాదన్నారు. తన భవిష్యత్తు సమస్య అసలు కాదన్నారు. చిన్న పిల్లాడిని తల్లి ఇష్టమా తండ్రి ఇష్టమా అని అడిగితే ఏం చెబుతారని ఇప్పుడు తన ముందు అదే సమస్య ఉందన్నారు. కాంగ్రెసు, తెలుగు ప్రజలు తనకు ముఖ్యమే అన్నారు. తాను ఉండగా విభజన వంటి పొరపాటు జరుగుతున్నందున ఇలా మాట్లాడాల్సి వస్తుందని చెప్పారు. తాను సిడబ్ల్యూసి నిర్ణయాన్ని గౌరవిస్తానని అయితే నష్టం చెప్పి పార్టీపై సమైక్యం కోసం ఒత్తిడి తెస్తున్నానని చెప్పారు.
తన తండ్రి అమర్నాథ్ రెడ్డి సమైక్యవాది అని, ఇప్పుడు తాను కూడా సమైక్యవాదిగానే ఉంటానని కాంగ్రెసు పార్టీలోనే ఉంటానని చెప్పారు. పార్టీని వీడనన్నారు. సమైక్య రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి పదవి వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, కాంగ్రెసు పార్టీని మాత్రం వీడేది లేదన్నారు. మరోవైపు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా సమైక్యాంధ్ర కోసం పదవి వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.