కిరణ్ చేతిలో బెర్లిన్ గోడ రాయి!, ఇక్కడిదేనేమో: బొత్స
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం జై సమైక్యాంధ్ర పార్టీ ప్రకటన సమయంలో తన చేతిలో ఉన్న చిన్న సంచిలో నుంచి ఓ చిన్న ముక్కను బయటకు తీసి చూపించారు. అదేమిటో చెబుతే బహుమతి ఇస్తానని విలేకరులకు చెప్పారు. విలేకరులు చెప్పలేదు. దీంతో ఆయనే వివరణ ఇచ్చారు.
ఈ రాయి బెర్లిన్ గోడ రాయి ముక్క అని, 15 ఏళ్ల కిందట అక్కడ నుంచి వచ్చిన ఒక స్నేహితుడు ఆ ముక్కను ఇచ్చారని, తూర్పు, పశ్చిమ జర్మనీ ప్రజలు ఒక్కటైనట్లుగా తెలుగు ప్రజలు మళ్లీ ఒకటవుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చట్టాలు చేసినా వాటిని తొలగించవచ్చునని, 14 ఎఫ్ అందుకు ఉదాహరణ అన్నారు.

జర్మనీని విభజిస్తూ 1961లో కట్టిన గోడను 1991లో ప్రజలే కూలగొట్టారని, తమ పార్టీ ముఖ్య ఉద్దేశం కూడా అదే అన్నారు. తెలుగు వారంతా కలిసి మెలిసి ఉండాలని, తాను చెబుతున్నా... కావాలంటే రాసుకోవచ్చునని చెప్పారు. రాష్ట్రం కలిసి ఉండాలనే ఉద్యమం తెలంగాణ ప్రాంతం నుంచే త్వరలోనే వస్తుందన్నారు. ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తే తప్పకుండా తిరగబడతారన్నారు. తెలుగువారంతా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలన్నదే తన సిద్ధాంతమమన్నారు.
బెర్లిన్ గోడదో.. ఇక్కడెక్కడైనా దొరికిందో : బొత్స
కలిసి ఉండాలనే ఉద్దేశంతో జర్మనీ ప్రజలు బెర్లిన్ గోడను పగలగొట్టారని, ఇది బెర్లిన్ గోడలోని రాయి అంటూ కిరణ్ చూపిన రాయిపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ చెణుకులు విసిరారు. ఏమో... ఆ రాయి ముక్క అక్కడిదో... లేక ఇక్కడే దొరికిందో అని సందేహం వ్యక్తం చేశారు. కిరణ్ పార్టీ గురించి మాట్లాడేందుకు ఏమీ లేదని తెలిపారు.












Click it and Unblock the Notifications