పార్టీ పెడుతా, కలిసొస్తారా: ఎమ్మెల్యేలతో కిరణ్ రెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టడం ఖాయమైందా, లేదా అనేది తెలియడం లేదు. ఆయన సోమవారంనాడు సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులతో సమావేశమయ్యారు. ఆదివారం కాంగ్రెసు బహిష్కృత ఎంపీలతో సమావేశమైన ఆయన సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమై ఒక్కొక్కరి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.
తాను పార్టీ పెడుతానని చెప్పి కలిసి వస్తారా అని అడిగినట్లు చెబుతున్నారు. బుధవారంనాడు కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ గురించి ప్రకటన చేయవచ్చునని అంటున్నారు. కిరణ్ రెడ్డితో 20 నుంచి 25 మంది శాసనసభ్యులు, పది మంది దాకా ఎంపీలు కలిసి రావచ్చునని భావిస్తున్నారు. తిరిగి పార్టీలోకి రావాలని కాంగ్రెసు పెద్దలు అడుగుతున్నారని, విభజన సరైన నిర్ణయం కాదనే విభేదించి రాజీనామా చేశానని ఆయన చెప్పారు.
ఇద్దరు మంత్రులు, ఏడుగురు శాసనసభ్యులు, నలుగురు ఎమ్మెల్సీలు, నలుగురు మాజీ శాసనసభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెసు అధిష్టానం తీరు బాధ కలిగించిందని కిరణ్ కుమార్ రెడ్డి వారితో అన్నట్లు తెలుస్తోంది. కొంత మంది వద్ద పార్టీ పెడుతున్నాను, వస్తారా లేదా అని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. మరికొంత మంది వద్ద పార్టీ పెట్టాలా వద్దా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎవరు కూడా తాము పార్టీలోకి వస్తామని గట్టిగా చెప్పలేదని అంటున్నారు.
కాగా, కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యం కోసం పోరాడారనే అభిప్రాయం ప్రజల్లో ఉందని సమావేశానంతరం శాసనసభ్యుడు రౌతు సూర్యప్రకాష్ రావు చెప్పారు. రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తానని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడుతారనే అభిప్రాయం ఉందని ఆయన అన్నారు. కార్యకర్తల అభిప్రాయం తెలుసుకుని మళ్లీ కలుస్తానని శాసనసభ్యురాలు వంగా గీత అన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి హాజరైనవారిలో శాసనసభ్యులు కొర్ల భారతి, గాదె వెంకటరెడ్డి, వంగా గీత, రౌతు సూర్యప్రకాష్ రావు, పంతం గాంధీ, జెసి దివాకర్ రెడ్డి, రామాంజనేయులు, మంత్రులు శైలజానాథ్, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీలు పాలడుగు వెంకటరావు, రెడ్డప్పరెడ్డి, లక్ష్మీశివకుమారి ఉన్నారు.