పార్టీ అధ్యక్షుడు కిరణ్ రెడ్డి: ప్యూహకర్తగా లగడపాటి
హైదరాబాద్: జై సమైక్యాంధ్ర పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ పార్లమెంటు సభ్యుడు చుండ్రు శ్రీహరి కాగా, అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తారు. మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యూహకర్తగా వ్యవహరిస్తారు. పార్టీ కార్యవర్గాన్ని కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో ప్రకటించారు. జి. గంగాధర్ కార్యదర్శిగా వ్యవహరిస్తారు.
పార్టీ ఉపాధ్యక్షులు - సాయి ప్రతాప్, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్, శైలజానాథ్, పితాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులుగా తులసిరెడ్డి, రత్నబిందు, శ్రీనివాస్, దొరస్వామి ఉంటారు. కోశాధికారిగా రామ్మూర్తి వ్యవహరిస్తారు. పార్టీ విధానాలను ఈ నెల 12వ తేదీన రాజమండ్రిలో జరిగే బహిరంగ సభలో వెల్లడిస్తామని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.

తమ పార్టీ టికెట్ల కోసం తెలంగాణ నుంచి దరఖాస్తులు వచ్చాయని ఆయన చెప్పారు. తమ సిద్ధాంతాల మేరకు ప్రజల కోసం పనిచేయాలని అనుకునేవారు తమ పార్టీలోకి రావచ్చునని ఆయన అన్నారు. ప్రజల మేలు రాష్ట్ర విభజన జరగాలని, నదీజలాలు ఇచ్చేది ట్రిబ్యునల్స్ మాత్రమే గానీ కేంద్రం కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు విభజన జరగకముందు ఓ మాట, వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాక ముందు, వచ్చిన తర్వాత కూడా అసత్యాలే చెబుతున్నారని ఆయన కెసిఆర్ను విమర్సించారు.
తమ పార్టీ రాజకీయాలకే కొత్తదనం తెస్తుందని, ప్రజలు మెచ్చే విధంగా ఉంటుందని ఆయన చెప్పారు. కలిసి ఉండాలనే కాంక్షతో ప్రజలు బెర్లిన్ గోడను కూడా పగులగొట్టారని ఆయన అన్నారు. ఎవరు గెలుస్తారనేది చంద్రబాబు నిర్ణయించేది కాదని, అలా నిర్ణయించేవారయితే ఇన్నేళ్లు ప్రతిపక్షంలో ఎలా ఉంటారని ఆయన అన్నారు. ప్రజలు గెలిపిస్తారని ఆయన అన్నారు. ప్రజల గుండె చప్పుడు గెలిపిస్తుందని అన్నారు. 1977లో కాంగ్రెసు పార్టీకి అభ్యర్థులు కూడా దొరగలేదని, అటువంటి స్థితిలో చంద్రబాబుకు కాంగ్రెసు ఐ టికెట్ ఇచ్చారని, దాంతో చంద్రబాబు గెలిచి నాయకుడయ్యారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications