నాదీ అదే బాధ: టిపై చంద్రబాబు, జగన్కు కిరణ్ పంచ్
విశాఖ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుది తెలంగాణవాదమో, సమైక్యవాదమో అర్థం కావడం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ఎద్దేవా చేశారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విడగొట్టాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారన్నారు.
విభజిస్తే భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకోవాలని దివంగత ఇందిరా గాంధీ ఆనాడే చెప్పారని ముఖ్యమంత్రి అన్నారు. తాను సమైక్యవాదినని ఇందిరా గాంధీ నాడు చెప్పారన్నారు. విభజన జరిగితే తెలంగాణకే ఎక్కువగా నష్టమని అభిప్రాయపడ్డారు. విభజనకు వ్యతిరేకంగా పోరాడుతోంది సీమాంధ్ర కాంగ్రెసు నాయకులే అన్నారు.
తల్లిదండ్రుల్లో ఎవరు ఎక్కువ అని అడిగితే పిల్లవాడికి ఇబ్బంది ఉంటుందని, ప్రస్తుతం తనదీ అదే పరిస్థితి అని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. కాగా, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచిన ఘనత దివంగత ఇందిరా గాంధీదేనని కిరణ్ అన్నారు. 1969, 1972 ఉద్యమాల తర్వాత రాష్ట్రం కలిసి ఉండాలని చెప్పిన ఏకైక వ్యక్తి ఇందిరా గాంధీ అన్నారు.
తాను ఇప్పటి వరకు ఇందిరా చెప్పిన మాటలనే ఉటంకిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధికి ఇందిరా గాంధీయే కారకులన్నారు. ఆమె తన చివరి రక్తపు బొట్టు వరకు దేశాన్ని బలోపేతం చేశారని, ఆమె మరణం వల్లే రాష్ట్రానికి ఇలాంటి దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదు రాష్ట్రాన్ని దేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లబాయ్ పటేల్ది అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచిన ఇందిరా గాంధీ, ఇదే విషయాన్ని పలుమార్లు పార్లమెంటులో చెప్పారన్నారు.