'టికి తెరాస వెన్నుపోటు, గత ప్రభుత్వానికి తేడా లేదు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల రుణమాఫీని 2013-14 సంవత్సరం పంట రుణాలకు మాత్రమే వర్తింప చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మండిపడ్డారు. రుణమాఫీ ఏడాదికే పరిమితం చేయడం వెన్నుపోటే అన్నారు. ఎన్నికల ప్రణాళికలో తెరాస రూ.లక్ష లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చి, ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు.
తెలంగాణ ప్రాంతాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పుడైనా ఊరట లభిస్తుందనుకుంటే అది కూడా జరగడం లేదన్నారు. రైతులకు న్యాయం చేయాలనంటే రూ.లక్ష వరకు అన్ని వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలన్నారు. బుధవారం కూడా అదిలాబాద్ జిల్లాలో రూ.ఐదు లక్షల రుణం చెల్లించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.

ఇప్పుడు పీఠం అధిష్ఠించిన తర్వాత కేవలం ఒక ఏడాది రుణాలే మాఫీ చేస్తామని, అది కూడా కేవలం పంట రుణాలేనని షరతులు విధించడం వెన్నుపోటు పొడవడమేనన్నారు. ఆత్మహత్యలను నివారించడానికి ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కౌలు రైతులను కూడా ఈ స్కీము కిందకు తీసుకురావాలని కోరారు.
మెదక్ లోకసభకు పోటీ
మెదక్ లోకసభ స్థానం ఉప ఎన్నికలో బిజెపి తప్పకుండా పోటీ చేస్తుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. 2014 ఎన్నికల్లో టిడిపితో పొత్తులో భాగంగా ఈ సీటును బిజెపికి కేటాయించారని, వచ్చే ఉప ఎన్నికలోనూ బిజెపియే పోటీ చేస్తుందన్నారు. ఎన్నికల సందర్భంలో తెరాస అనేక రకాలుగా హామీలు ఇచ్చి ప్రజలకు ఆశలు కల్పించిందన్నారు. హామీలన్నింటినీ టీఆర్ఎస్ అమలు చేయకపోతే పాత ప్రభుత్వాలకు, తెలంగాణ ప్రభుత్వానికి పెద్దగా తేడా ఉండదన్నారు.












Click it and Unblock the Notifications