మజ్లిస్ కనుసన్నల్లోనే: టిఆర్ఎస్ పాలనపై కిషన్ ఫైర్
మెదక్: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దారిలోనే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కూడా నడుస్తోందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. మజ్లిస్ కనుసన్నల్లోనే టిఆర్ఎస్ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లింలకు 12 శాతం, క్రిస్టియన్లకు 3 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పబ్బం గడుపుతోందని టిఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మంగళవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరిగిన తెలంగాణ బిజెపి కౌన్సిల్ సమావేశంలో కిషన్రెడ్డిని రాష్ట్ర అధ్యక్షునిగా రెండోవసారి ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రెండు నెలల టిఆర్ఎస్ ప్రభుత్వం పాలన అధ్వాన్నంగా ఉందని, ఎన్నికల్లో ఇచ్చిన హామిల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ పార్టీ విశిష్ట పోరాటం చేసిందని, జెఎసితో కలిసి ఉద్యమించిందని పేర్కొన్నారు.
కేంద్రంలో ఎన్డీయే అధికారం చేపట్టాక తెలంగాణ బిజెపి ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్లి పలువురు కేంద్ర మంత్రులను కలిసి, రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు, పథకాలు, నిధుల కేటాయింపుల గురించి అభ్యర్థించిందని తెలిపారు. ఇందుకు ప్రతిస్పందనగా తెలంగాణకు ఎయిమ్స్, ఉద్యానవనం విశ్వవిద్యాలయం కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం మొత్తం విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతాంగానికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పినా ఎక్కడ కూడా అమలు కావడం లేదని, దీంతో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా నేటికి పంట రుణాల మాఫీ కాలేదని, కొత్త రుణాలు అందకపోవడంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఖాళీవున్న 2 లక్షల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.