50-9 అడిగితే: టిడిపితో పొత్తుపై కిషన్, విభజనపై కిషోర్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో పొత్తు చర్చల పైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అంబరుపేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి శుక్రవారం స్పందించారు. ఇవాళో లేదా రేపో టిడిపితో పొత్తు, సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చే అవకాశముందని కిషన్ పేర్కొన్నారు. తాము తెలంగాణ ప్రాంతంలో 50 అసెంబ్లీ, 9 పార్లమెంటు స్థానాల కోసం అధిష్టానానికి ప్రతిపాదన చేశామన్నారు.
అదేవిధంగా సీమాంధ్రలో 20 అసెంబ్లీ, ఆరు లోకసభ స్థానాలను కోరుతున్నామన్నారు. తెలంగాణ ప్రాంతంలో యాభై సీట్లకు గాను 30 స్థానాల పైన స్పష్టత వచ్చిందని చెప్పారు. మరో ఇరవై అసెంబ్లీ సీట్ల సర్దుబాటుకు చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. కాగా, టిడిపి - బిజెపి పొత్తు విషయంలో సీట్ల పైన ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే.

ఈసికి యనమల లేఖ
సాక్షి పత్రికలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనుకూల కథనాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఫ్యాన్ గుర్తుతో వచ్చే వార్తలను పార్టీ లేదా అభ్యర్థుల ఖర్చుగా చూడాలన్నారు. సాక్షిలోని జగన్ పార్టీ అనుకూల ప్రసారాలను ఈసి పర్యవేక్షించాలన్నారు. ఫ్యాన్ గుర్తు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోగోతో వార్తలు ప్రచురించకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
మేలు జరిగింది: కిషోర్ చంద్రదేవ్
విభజనతో సీమాంధ్రకు మేలే జరిగిందని కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ తెలిపారు. 50 ఏళ్ల నుండి పోరాడుతున్నప్పటికీ సాధించలేనివి విభజనతో దక్కాయన్నారు. కొత్త రాజధాని, జాతీయ యూనివర్శిటీలు, ప్రాజెక్టులు విభజనతోనే సాధ్యమయ్యాయని చెప్పారు. సర్వేలను నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే సీమాంధ్రలో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయన్నారు.












Click it and Unblock the Notifications