లక్ష కోట్లిచ్చినా నన్ను కొనలేరు, అసంతృప్తి ఉన్నా: కిషన్

తాను ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడలేదని, అవన్నీ తన గురించి, బిజెపి నాయకత్వ నడవడిక గురించి తెలియని వారు కూస్తున్న కారుకూతలేన్నారు. పొత్తుల విషయంలో తాను పార్టీ అధ్యక్షుడిగా కేడర్ మనోభావాలను ప్రతిబింబించానని, కేడర్ సంతోషమే తన సంతోషమన్నారు. ఈ పొత్తుపై బిజెపి కార్యకర్తల్లో, నేతల్లో అసంతృప్తి ఉందని, మొదట్నుంచీ తాము పొత్తును వ్యతిరేకించామని, మోడీని ప్రధానిగా చేయడం కోసం ఎవరు మద్దతు ఇచ్చినా తీసుకుంటున్నామన్నారు.
ఎవరు పార్టీలోకి వచ్చినా చేర్చుకుంటున్నామని, తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే టిడిపితో పొత్తుతో ముందుకెళ్తున్నామని చెప్పారు. జాతీయ నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నందున దీన్ని తాము అంగీకరించాల్సి ఉందన్నారు. కానీ, పొత్తు పట్ల కార్యకర్తలు, నేతల్లో నిరుత్సాహం, ఆందోళనలు ఉన్నాయని తాను సంఖ్య కోసం పోరాడలేదని, తాము సగం సీట్లు కోసం పట్టుపట్టినా చివరకు 47 సీట్లకు పరిమితమయ్యామన్నారు.
మహబూబ్నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడికి సీటు దక్కలేదన్నారు. అలాగే, పార్టీ కోరిన ముఖ్యమైన సీట్లు.. నారాయణపేట, సూర్యాపేట, పెద్దపల్లి, నిజామాబాద్ రూరల్, బోధన్, బాల్కొండ, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, రాజేంద్రనగర్ సీట్లు తమ పార్టీకి దక్కలేదన్నారు. రంగారెడ్డి జిల్లాలోని పద్నాలుగు సీట్లలో కేవలం రెండు సీట్లు మాత్రమే బిజెపికి ఇస్తే... దానికి కూడా ఇబ్బంది పెడితే ఎలా అన్నారు.
ఇది కార్యకర్తల్లో ఆందోళనకు దారితీస్తోందని, అందుకే కార్యకర్తల్లో అసంతృప్తిని తొలగించే చర్యలు చేపట్టామని, వారిని పిలిపించి సర్దిచెబుతున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన కార్యకర్తలు వారు కోరుకున్న చోట పోటీ చేయాలనుకోవడంలో తప్పు లేదని, ఆ సీటు దక్కని చోట ఆశావహులు ఆందోళన చేస్తున్నారని, వారిని బుజ్జగించి సముదాయిస్తున్నామన్నారు.
కేంద్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేసేలా చూస్తానన్నారు. దక్షిణ భారత దేశంలో కర్ణాటక తర్వాత బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. రాజకీయాలకు అతీతంగా లక్షలాది మంది బిజెపిని గెలిపించడానికి ముందుకు వస్తున్న సందర్భంలో రెండు పార్టీలూ కలిసి పనిచేయడానికి ఎలాంటి ఆటంకాలు ఉండబోవన్నారు.
ఎన్డీయేలో టిడిపి భాగస్వామి అయిందని, సంయుక్తంగా ప్రచారం చేసి ఇరు పార్టీల అభ్యర్థులనూ గెలిపించేందుకు ప్రజల మద్దతు కూడగడతామన్నారు. ఐకాసలో లేని టిడిపితో పొత్తుపై ప్రశ్నించగా... బిజెపికి ఒకనీతి, తెరాసకు ఒక నీతి ఉంటుందా అని ప్రశ్నించారు. తెరాసలో కొండా సురేఖ, మహేందర్ రెడ్డి వంటి కాంగ్రెసు, టిడిపి ఎమ్మెల్యేలు చేరిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సిపిఎంతో పొత్తు కోసం ప్రయత్నాలు జరిగాయి.
ఉద్యమకారులను అణిచేసిన వాళ్లను, తుపాకులతో పేల్చినోళ్లను తెరాస పార్టీలోకి చేర్చుకుందన్నారు. టిడిపికి, బిజెపికి వేరు వేరు మేనిఫెస్టోలుంటాయన్నారు. సికింద్రాబాద్లో తాను ఎంపీగా పోటీ చేయాలనే అలోచన లేదని, ఆ ప్రస్తావన పార్టీలో ఏ స్థాయిలోనూ రాలేదన్నారు.












Click it and Unblock the Notifications