మీరడగకుండా: కేసీఆర్పై కిషన్, 120 ఏళ్లైనా: టిఎన్జీవో
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోందని తెరాస విమర్శించగా.. ఆ వ్యాఖ్యల పైన భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి శనివారం మండిపడ్డారు. కేంద్రం నుంచి తగిన నిధులు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, అప్పుడే అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల విషయంలో ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదన్నారు.
రాష్ట్రం నుంచి తన ఆధ్వర్యంలో వెళ్లిన పార్టీ బృందం మూడు రోజుల పాటు ఢిల్లీలో 14 మంది కేంద్రమంత్రులను కలిసి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లిందని చెప్పారు. ఏ మంత్రి వద్దకు వెళ్లినా... ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని చెప్పారన్నారు.తమకు రాజకీయాలు ముఖ్యం కాదని, రాష్ట్ర అభివృద్ధే ప్రధానమన్నారు. రాష్ట్ర ప్రగతికి సంబంధించి పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను మంజూరు చేయాల్సిందిగా కేంద్రమంత్రులను కోరామన్నారు.

గిరిజన విశ్వవిద్యాలయం, ఉద్యానవన యూనివర్సిటీ మంజూరుకు కేంద్రం సమ్మతించిందని తెలిపారు. రైల్వే మంత్రిని రైల్వే ప్రాజెక్టుల గురించి కోరగా... రైల్వే శాఖలో ఆర్థిక ఇబ్బందులున్నాయని, ఈ దృష్ట్యా కొత్త రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్లు ఇవ్వడం కష్టమని చెప్పారన్నారు. ఆగస్టు తర్వాత మరోసారి భేటీ అవుతామని, అప్పుడు కొత్త లైన్ల గురించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు.
సిద్ధంగా లేరు: టీఎన్జీవోలు
తెలంగాణ ఉద్యోగులు ఎవ్వరూ ఆంధ్రా ప్రాంతానికి వెళ్లడానికి సిద్ధంగా లేరని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ వేరుగా తెలిపారు. పదవీ విరమణ వయస్సు 60 సంతవ్సరాలకు పెంచడం వల్ల వందలాది మంది ఉద్యోగులు ఆంధ్రాకు వెళ్లడానికి ఉత్సాహం చూపిస్తున్నారనడంలో వాస్తవం లేదన్నారు. 60 కాదు కదా 120 సంవత్సరాలకు పెంచినా వెళ్లడానికి ఏ తెలంగాణ ఉగ్యోగి సిద్ధంగా లేరన్నారు.
స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల విభజన జరిగే వరకూ తెలంగాణ రాష్ట్రంలో పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలకు పెంచవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి కమలనాథన్ కమిటీ ఇప్పటికీ మార్గదర్శకాలను రూపొందించలేదన్నారు. కమిటీ స్వతంత్రంగానే పని చేయాలని ఇరురాష్ట్రాల ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఇక్కడ తెలంగాణ ఉద్యోగులే పనిచేయాలని సీమాంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపాల్సిందేనన్నారు.












Click it and Unblock the Notifications