సోనియాతో ఫొటో దిగినప్పుడేమైంది: కెసిఆర్పై కిషన్
హైదరాబాద్: పోలవరం ఆర్డినెన్స్ విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తప్పుడు ప్రచారం చేస్తోందని, ఇది ఆ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమని బిజెపి తెలంగాణ నేత జి. కిషన్ రెడ్డి అన్నారు. తెరాస బంద్ పిలుపును తాము వ్యతిరేకించడం లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు బెదిరింపులకు నరేంద్ర మోడీ భయపడబోరని ఆయన అన్నారు. అబద్ధాలు ప్రచారం చేయడం కెసిఆర్ నైజమని కిషన్ రెడ్డి అన్నారు
పోలరం ఆర్డినెన్స్పై తీర్మానం ఎప్పుడు జరిగిందో తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చెప్పాలని ఆయన డీమాండ్ చేశారు. పోలవరం ముంపు మండలాలపై గతంలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన మీడియా సమావేశంలో చదివి వినిపించారు. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలపాలనేది ఎన్డియె నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు. పోలవరంపై అనవసమైన రాద్ధాంతం చేయవద్దని ఆయన అన్నారు.
కాంగ్రెసు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెరాస మోడీకి ఆపాదిస్తోందని విమర్శించారు. సోనియాతో గ్రూప్ ఫొటోలు దిగినప్పుడు పోలవరం విషయం ఎందుకు గుర్తు రాలేదని ఆయన అడిగారు. కెసిఆర్ అనవసరంగా కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్నారని ఆయన అన్నారు. తెరాస వైఖరి వల్ల భవిష్యత్తులో తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని అన్నారు.
న్యాయపోరాటం చేస్తాం: వినోద్
పోలవరంపై కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్పై న్యాయ పోరాటం చేస్తామని తెరాస పార్లమెంటు సభ్యుడు వినోద్ చెప్పారు. ఆర్డినెన్స్ను ఇప్పుడు ఎందుకు తీసుకువచ్చారో అర్థం కాలేదని ఆయన గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో అన్నారు. చట్టప్రకారం ఇది సరి అయినది కాదని అందుకే ఆర్డినెన్స్పై సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని తెరాస నిర్ణయించిందని వినోద్ తెలిపారు.