జగన్ పాలన అద్భుతం - సీఎం ఆ పదవి ఇస్తే సంతోషిస్తా : ఆలీకి డాక్టరేట్ : టిక్కెట్ ధరల వివాదంపైనా..!!
కమెడియన్ ఆలీకి గౌరవ డాక్టరేట్ దక్కింది. వేయికి పైగా సినిమాల్లో నటించిన ఆలీ.. హీరోగానూ మెప్పించారు. ఇక, తాజాగా ఆయన బుల్లితెర పైన చేస్తున్న టాక్ షో లకు మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. చిన్న వయసులోనే వెండి తెర పైన ఎంట్రీ ఇచ్చి... అనేక అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న ఆలీకి ఇప్పుడు గౌరవ డాక్టరేట్ దక్కింది. ఆలీకి కె.ఎల్.యు. యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రకటించింది. డాక్టరేట్ ప్రకటించడం ఆనందంగా ఉందని ఆలీ చెప్పుకొచ్చారు.
ఇక ఆలీ..డాక్టర్ ఆలీగా
రాజమండ్రిలో ఉన్న ఆలీ తాను సొంత ఊరులో ఉన్న సమయంలో తనకు గౌరవ డాక్టరేట్ రావటం పై సంతోషం వ్యక్తం చేసారు. ఆలీ అయిదు బాషల్లో సినిమాల్లో నటించారు. ఇదే సమయంలో ఆలీ రాజకీయంగానూ కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ పాలన పైన ప్రశంసలు కురిపించారు. తనకు మంత్రి పదవి వస్తే మరింతగా సంతోషపడతానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన ఏపీలో టిక్కెట్ల ధరల పెంపు.. బెనిఫిట్ షో లకు అనుమతి అంశాలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
జగన్ పైన ప్రశంసలు
ముఖ్యమంత్రి జగన్ సినీ ఇండస్ట్రీ సమస్యల పైన సానుకూలంగా ఉన్నారని.. సమస్య పరిష్కారానికి ఇప్పటికే హామీ కూడా ఇచ్చారని చెప్పారు. జగన్ పాలన అద్బుతమన్నారు. అన్ని వర్గాలకు జగన్ పాలనలతో సమన్యాయం జరుగుతోందని వివరించారు. 2019 ఎన్నికల సమయంలో ఆలీ వైసీపీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆలీ జనసేనలో చేరుతారని..2019 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారని అప్పట్లో ప్రచారం సాగింది. అయితే, అందుకు బిన్నంగా ఆలీ వైసీపీలో చేరారు.
వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దంగా
ఆ పార్టీ అభ్యర్దులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక, జగన్ సీఎం అయిన తరువాత ఆలీకి నామినేటెడ్ పదవి దక్కుతుందని అందరూ అంచనా వేసారు. కానీ, ఎన్నికల తరువాత ఆలీ రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. కానీ, అప్పుడప్పుడు సీఎం జగన్ తో సమావేశం అవుతున్నారు. రాజకీయంగా వైసీపీ లో చేరటంతో.. పవన్ కళ్యాణ్ తో కొంత గ్యాప్ ఏర్పడింది. కానీ, ఒక వివాహ వేడుకలో ఇద్దరూ కలిసి..ఆప్యాయంగా మాట్లాడుకోవటంతో ఆ వివాదం సమిసిపోయింది. అయితే, రానున్న ఎన్నికల్లో మాత్రం ఆలీ ఖచ్చితంగా బరిలో నిలుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.